రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం - రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది : ఎంపీ కనకమేడల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 3:42 PM IST

thumbnail

MP Kanakamedala Ravindra Kumar Comments on AP Farmers Suicides : రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అన్నదాతల బలవన్మరణాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

 Andhra Pradesh Ranks Third in Farmer Suicides in Country : జాతీయ నేర గణాంకాల ప్రకారం 2020-21లో ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు 19శాతం పెరిగాయని కనకమేడల తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2020-21లో 1065 మంది అన్నదాతలు, కౌలు  రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2020లో 889 మంది చనిపోయారని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టులో కర్నూలు జిల్లాలో ఒక్కరోజులోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.