Ketireddy Controversial Comments: 'అన్నం తినే వాళ్లు ఎవరైన వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపి.. ఓటు వేయాల్సిందే'
MLA Ketireddy Venkata Ramireddy Controversial comments : ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఉదయాన్నే 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' అంటూ ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వారిని మభ్యపెడుతుంటారు. ప్రసంగాల్లో అయితే ప్రజలను ఉద్దేశించి బూతు పురాణం అందుకుంటారు. అవి కాస్తా వివాదాస్పదం అవుతుంటాయి. ఆయన మాత్రం తన పద్దతిని మార్చుకోకుండా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ధర్మవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ఓటర్లను ఉద్దేశించి అన్నం తినే వాళ్లు ఎవరైన వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపాల్సిందేనని రెచ్చిపోయారు. ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పొట్టి శ్రీరాములు సర్కిల్లో కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ప్రసంగించారు. టీడీపీపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందని, టీడీపీ వారు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న టీడీపీ వారు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తినే వాళ్లు ఎవరైన వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపి.. ఓటు వేయాల్సిందేనని ఓటర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.