హత్యకు దారితీసిన సహజీవనం - మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడి ఘాతుకం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 1:55 PM IST
Man Beat Woman to Death: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పాతగణేశునిపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం పట్టణానికి చెందిన పాపులమ్మ(35) భర్త మృతి చెందడంటో ఓ హోటల్ పనిచేస్తూ జీవిస్తోంది. అదే హోటల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి వంట మాస్టరుగా పని చేస్తున్నాడు. ఇతడి భార్య నాలుగేళ్ల కిందట మృతి చెందింది. వీరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వంట మాస్టరుతో పరిచయం కాక ముందు ఆమెకు నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఉంది.
ఇటీవల నాగరాజు ఇంటికి వచ్చి పోతున్నాడనే అనుమానం ఏర్పడింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఆమె వంట మాస్టరు ఇంటికి వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ జరిగి మాటమాటా పెరిగి కిరణ్ కుమార్ రోకలిబండతో ఆమె తలపై బాదడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి చెల్లెలు రాణి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్సై రబ్బానీ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.