రైతులు, నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం: కొల్లు రవీంద్ర
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 6:08 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20459462-thumbnail-16x9-kollu-ravindra-fires-on-ycp-government.jpg)
Kollu Ravindra Fires on YCP Government: నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మాట తప్పను-మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ రైతుల నుంచి నిరుద్యోగుల వరకు అందర్నీ వంచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత అని ఆయన మండిపడ్డారు. ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే జగన్ తన మాటకు కట్టుబడ్డాడని రవీంద్ర విమర్శించారు. ‘జయహో బీసీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అన్ని చోట్లా మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా పరిపాలన సాగించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు తీవ్ర ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రవీంద్ర మండిపడ్డారు. రీవర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని అటక ఎక్కించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలైన జాబ్ క్యాలండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు.