JC Diwakar Reddy on Farmers Problems: వైసీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రశ్నించే నాయకుడే లేడు.. స్వార్థం కోసం విధ్వంసం : జేసీ
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 4:05 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-10-2023/640-480-19871462-thumbnail-16x9-jc-diwakar-reddy.jpg)
JC Diwakar Reddy on Farmers Problems: ఇసుక కోసం ఉన్న నీటిని వదిలి రైతులను ఇబ్బందుల్లో పడేశారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కార్యాలయంలో ఎస్ఈ రాజశేఖర్ను ఆయన కలిసి హెచ్ఎల్సీ కాల్వకు నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ఎల్సీ కాలువలో నీరు లేక రైతులు పెట్టిన పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సొంత లాభం కోసం రైతులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రైతుల కోసం నీరు కావాలని అడిగే అధికారి గాని, నాయకులు గాని ఈ పాలనలో లేరని విమర్శించారు.
ఇలాంటి దుర్మార్గపు పాలనలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పెట్టిన పంటకు పెట్టుబడులు రాని పరిస్థితి జిల్లాలో ఏర్పడిందన్నారు. తాను రాజకీయాల్లో లేనని, రాజకీయంగా నిలబడలేదని, ప్రజల కోసం ఇవాళ వచ్చానని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ముఖ్యమంత్రిని అడిగి పక్క రాష్ట్రంతో మాట్లాడి నీటి కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.