Janasena Agitation: ప్రభుత్వమే ఇసుక దొంగతనానికి పాల్పడుతోంది: జనసేన
Janasena Agitation On Sand Excavation: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కృష్ణా నదిలో ప్రభుత్వమే ఇసుక దొంగతనానికి పాల్పడుతుందని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తాడేపల్లి మండలం గుండి మెడ ఇసుక క్వారీ వద్ద జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఎం జగన్ దత్త సంస్థ అయిన జేపీకి గడువు ముగిసినా రోజుకి వేల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారని జనసేన నేతలు చెప్పారు. గతంలో గుండెమెడ రీచ్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని జనసేన నేతలు నిలదీశారు. పోలీసులు అక్రమ ఇసుక రవాణాను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జనసేన నేతలను నిలువరించేందుకు దాదాపు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వమే దొంగతనం చేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి..పెద్ద ఎత్తున కృష్ణా నదిలో ప్రభుత్వం ఇసుక దొంగతనం చేస్తోంది. దొంగలని పట్టుకోవలసిన ప్రభుత్వం ఆ దొంగలకే కాపలా కాస్తోంది. మనుషులు నడవడానికి రోడ్డు వేయరు కానీ ఇసుక తీసుకెళ్లడానికి మాత్రం లారీలు వెళ్లడానికి అనువుగా రోడ్డు వేస్తున్నారు. -గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు