జగన్ విధానాలతో రాయలసీమకు తీవ్ర నష్టం - సాగునీటి సాధన సమితి నాయకుల ఆందోళన
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 12:12 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2023/640-480-20156271-thumbnail-16x9-farmers-association-meeting-in-vijayawada.jpg)
Farmers Association Meeting in Vijayawada: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ విధానాల వల్ల రాయలసీమ ప్రాంతం నీటి ఎద్దడితో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సాగునీటి సాధన సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా గోదావరి నది జలాల పంపిణీపై రాష్ట్ర హక్కులను కాపాడాల్సిందిగా రైతు సంఘాల నాయకులు కోరారు. పలువురు రైతు సంఘాల నాయకులు చెరుకూరి వీరయ్య, యెర్నేని నాగేంద్రనాథ్, చలసాని సుబ్బారావు మృతికి సంతాపంగా కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీపై గురువారం విజయవాడలో చర్చావేదిక రైతు సంఘాల నాయకులు నిర్వహించారు. ఈ చర్చావేదికలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
Jagan Government Failed to Discuss Rights of krishna River water : నీటి పంపిణీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులపై వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే కృష్ణా జిల్లాల పునఃపంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విభజన, బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014ను అనుసరించి, కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్కు లభించిన నీటి వనరులను గూరించి రైతుల సంఘాల నాయకులు చర్చించారు. వైసీపీ ప్రభుత్వం నీటి పంపిణీ వ్యవహారంలో ఆంధ్రరాష్ట్ర హక్కులపై స్పందించకపోవడం వల్లే కృష్ణా జలాల పునః పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ,గత ట్రిబ్యునల్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు నిర్మిస్తుందని..తెలంగాణ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు నిర్మాణం వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు జరిగే అనర్థాలను ట్రిబ్యునల్కి నివేదించడంలో జగన్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు.