Demands of AP Government Employees : వైనాట్ ఓపీఎస్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు
Demands of AP Government Employees : వైనాట్ ఓపీఎస్ అని సీపీఎస్ ఉద్యోగులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని.. ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ తేల్చిచెప్పింది. అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ను రద్దు చేస్తామని ఉద్యోగులకు మొట్టమొదటి హామీ ఇచ్చి.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి.. నాలుగేళ్ల తరువాత జీపీఎస్ ఆర్డినెన్సు అని సీఎం ప్రకటించటం శోచనీయమని వ్యాఖ్యానించింది. సీపీఎస్ ఉద్యోగులతో కనీసం చర్చించకుండా లక్షలాది కుటుంబాల భవిష్యత్ను అంధకారంలో పడేశారని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. చట్టసభల్లో కనీసం చర్చ కూడా జరపకుండా.. జీపీఎస్ ఆర్డినెన్సును తీసుకు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టదన్నారు. పొరుగు రాష్ట్రాలన్నీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న తరుణంలో దేశానికి జీపీఎస్ ఎలా ఆదర్శం అవుతుందో చెప్పాలన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ఆలోచించి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.