CPI State Secretary Ramakrishna: జగన్​ను నమ్ముకుంటే పోలవరం పూర్తి కానట్టే..: రామకృష్ణ

By

Published : Jul 5, 2023, 6:13 PM IST

thumbnail

CPI State Secretary Ramakrishna: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఇప్పుడే పూర్తి కాదనే స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... పోలవరం పూర్తి చేస్తామని మంత్రులు తొడలు గొట్టారు.. ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి షెకావత్ ప్రకటనతో అసలు వాస్తవాలు వెలుగులోకి‌ వచ్చాయని తెలిపారు. కాంట్రాక్టు మార్చి, రివర్స్ టెండర్​తో ఇంకా ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయ డెయిరీని చంపి అమూల్​కు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అదానీ వద్దే స్మార్ట్ మీటర్లు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించిన రామకృష్ణ.. 7,500 రూపాయల ధర ఉన్న స్మార్ట్ మీటర్​ను 34 వేల రూపాయలకు ఎవరైనా కొంటారా అని నిలదీశారు. అదానీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆస్తులను దోచి పెడుతోందని ఆరోపించారు. మళ్లీ ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రాన్ని కోరాలన్నారు. మీ మేలు కోసం, కేసుల కోసం, అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమే వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిస్తే.. ఆ చర్చల సారాంశం జగన్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన వివరాలను జగన్ మీడియా ముందుకు వచ్చి వివరించాలన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.