ఇంటి స్థలం కబ్జా చేశారని నెల్లూరు కలెక్టరేట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 3:57 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20457841-thumbnail-16x9-couple-attempted-suicide-at-nellore-district-collectorate.jpg)
Couple Suicide Attempt at Nellore Collectorate: నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటి స్థలం కబ్జా చేశారంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. నెల్లూరుకు చెందిన బలపాటి మురళి, అతని భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కలెక్టర్, కార్యాలయంలోని సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దేవరపాలెం గ్రామంలో ప్రైవేటు వ్యక్తులు రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇంటిని కూల్చివేసి స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు దంపతులు, పిల్లలు బైఠాయించారు. ఆరు నెలలుగా ఇల్లు లేక రోడ్డుపైన కుటుంబమంతా ఉంటున్నామని బాధితులు వాపోయారు.
ఇంటిని పడగొట్టి, సామాన్లు మొత్తం ధ్వంసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఏడు లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు తెలిపారు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. స్పందనలో తమ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు కాగితాలను అధికారులకు చూపించారు. ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. పోలీసులు, డీఆర్వో సర్ధి చెప్పి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.