Contract Employees Protest: "సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే.. నిరవధిక సమ్మెకు సిద్ధం"
contract employees protest: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పంద ఉద్యోగులు, కార్మికులు గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతం అందించాలని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నికల సమయంలో ఒప్పంద ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్ నేడు హామీలన్నీ కాలరాశారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు బాబు మండి పడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా తమ సమస్యలపై దృష్టి సారించకపోవటం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల పై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఈ విధానం ఇప్పటిది కాదని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కార్మికుల కష్టాలను దృష్టిలో వుంచుకొని 1996లో ఒప్పంద ఉద్యోగులుగా తమని గుర్తించారని గుర్తు చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒప్పంద కార్మికుల గురించి తెలియకుండా మాట్లాడటం సిగ్గు చేటు అని ఆరోపించారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒప్పంద కార్మికులతో నిరవధిక సమ్మె చేపడతాం అని హెచ్చరించారు.