CM Jagan Released YSR Kalyanamasthu Shadithofa Funds: పిల్లల చదవులు, పెళ్లిళ్ల కోసం పేదలు అప్పుల పాలు కావద్దు: సీఎం జగన్
CM Jagan Released YSR Kalyanamasthu Shadithofa Funds: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మాసాల మధ్య వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద నిధులు విడుదల చేశారు. అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
CM Jagan Comments: మా ప్రభుత్వ లక్ష్యం అదే.. సీఎం జగన్ మాట్లాడుతూ..''పేద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలి. పిల్లల చదవులు, పెళ్లిళ్ల కోసం పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. చదువు అనే బ్రహ్మాస్తం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండాలనేదే మా ప్రభుత్వ ఆరాటం. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని ఈరోజు విడుదల చేశాం. వధువు తల్లుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తున్నాం. ఇప్పటివరకూ 86శాతం మంది అమ్మాయిలు డిగ్రీలు పూర్తి చేసుకుని, పెళ్లిళ్లు చేసుకున్నారు. పేదల బతుకులు మారాలని.. ప్రతి ఆడపిల్ల కనీసం డిగ్రీ వరకు చదవాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం'' అని జగన్ వ్యాఖ్యానించారు.