Chandrababu Public Meeting at Ravulapalem: యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు: చంద్రబాబు
Chandrababu Made Accusations Against the YCP: రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందోదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. యువత మత్తుకు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయిని కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెంలో రోడ్షో, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు జగన్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, బిల్లులతో మోత పుట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్నరోజుల్లో సోలార్ విద్యుత్ గేమ్ ఛేంజర్గా మారబోతోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. సోలార్ విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావడంతో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రావులపాలెంలో వైకాపా నేతలు ఇష్టానుసారంగా ఇసుక దోచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు ఇప్పించి సంపద సృష్టించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు వెల్లడించారు.