Somu Veerraju on pawan statements పవన్ ఆలోచనను.. దిల్లీ పెద్దలకు తెలియజేస్తాం
Somu Veerraju Sensational Comments: రాష్ట్రంలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని, దిల్లీ పెద్దలకు తెలియజేస్తామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ వద్ద ప్రజా ఛార్జి షీట్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. ఈనెల 18తేదీ కల్లా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఛార్జి షీట్ కార్యక్రమాలు పూర్తిచేస్తామన్నారు. 19 తేదీన గన్నవరంలో రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులతో సమావేశం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా సోము స్పందించారు. బీజేపీతో ఉన్నానంటూనే, టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారని తెలిపారు. ఎవరిని చర్చలు వారు చేస్తున్నా... బీజేపీ కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామన్నారు. నెల్లూరులో బీజేపీ నేతల్ని పోలీసులు తీవ్రంగా హింసించిన ఘటనపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.