కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా రాష్టాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ సర్కారు విఫలం - పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 4:54 PM IST

thumbnail

AP BJP President Purandeswari Fires on YCP Govt : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా... అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని... బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీలో సుపరిపాలన ఎక్కడుందో చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా... అన్నమయ్య జిల్లా బోయనపల్లిలో చేనేత కార్మికుల కుటుంబాలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోట కల్యాణ మండపంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి దిశా నిర్దేశం చేశారు.

కేంద్రం వెనకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం ఏడాదికి 350 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తోందని పురేందేశ్వరి వెల్లడించారు. అయినా, ఈ ముఖ్యమంత్రి కనీసం రహదారులు కూడా నిర్మించలేక పోయారన్నారు. పీలేరు-తిరుపతి, కడప-తిరుపతికి 4 వేల కోట్ల రూపాయలను రహదారుల నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవన్న ఆమె... రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం మంజూరైతే స్థలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ కోసం రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభిస్తే... జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ లైన్ వద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసమం అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. అయితే, ఆ పాలన ఎలా ఉందో ప్రజలే గుర్తించాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లవుతున్నా వాటి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని పురందేశ్వరి  విమర్శించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై సీబీఐ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించాలా అంటూ పురందేశ్వరి ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.