ETV Bharat / state

YS Viveka Case: వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెప్పారు: ప్రతాప్‌రెడ్డి

author img

By

Published : Feb 25, 2022, 11:43 AM IST

Updated : Feb 26, 2022, 4:53 AM IST

viveka
viveka

11:29 February 25

సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి పెద్దనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం

YS Viveka Murder CAse: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డిపై కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని అవినాష్‌రెడ్డి పెదనాన్న, భాస్కర్‌రెడ్డి సోదరుడు వై.ఎస్‌.ప్రతాప్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. భాస్కర్‌రెడ్డి ఎప్పుడూ వివేకానందరెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని వెల్లడించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను వివేకా పరిష్కరించేవారని.. దీంతో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదని వివరించారు. వివేకాను ఆయన శత్రువులూ గౌరవించేవారని, ఆయన నిర్ణయాల్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని చెప్పారు. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఈర్ష్యకు ఇవన్నీ కారణాలేనన్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేకా... పులివెందుల రింగ్‌రోడ్డులోని తన కార్యాలయానికి వచ్చి అరగంట మాట్లాడారని, 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్‌ వై.ఎస్‌.విజయమ్మకు లేదా షర్మిలకు ఇవ్వాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలిపారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాష్‌రెడ్డి మంచి అభ్యర్థి అవుతారన్న భావన వ్యక్తం చేశారని వివరించారు. ప్రజల్లోనూ అదే ప్రచారం ఉండేదని చెప్పారు. గతేడాది ఆగస్టు 16న ప్రతాప్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా అది వెలుగుచూసింది. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి అత్యంత సాధారణంగా, ఉదారంగా ఉండే రాజకీయ నాయకుడు. ఆయన శ్రేయోభిలాషులు చాలామంది ఆయనకే కడప లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని సిఫార్సు చేశారు’ అని ప్రతాప్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందులోని ఇతర ప్రధానాంశాలివే.

ఏదో తేడా ఉందని గుర్తించినా.. ఎవరికీ చెప్పలేదు

2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.50 గంటల సమయంలో నా సోదరుడు వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి ఫోన్‌ చేసి గుండెపోటు, రక్తపు వాంతులతో వివేకా మరణించారని చెప్పారు. ఉదయం 7.20 గంటలకు నేను అక్కడికి వెళ్లి చూసేసరికి మనోహర్‌రెడ్డి హాల్లో ఉన్నారు. బయట అవినాష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లేసరికి అక్కడ ఎం.వి.కృష్ణారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇనయతుల్లా, ఆయన సోదరుడు ఉన్నారు. బెడ్‌ సమీపంలో రక్తపు మడుగు ఉంది. తలగడ, బెడ్‌షీట్‌పై రక్తం ఉంది. కమోడ్‌ సమీపంలో రక్తపు మడుగులో వివేకా మృతదేహం ఉంది. గోడలపైన రక్తం ఉంది. నుదుటిపై తీవ్ర గాయాలున్నాయి. ఇవన్నీ చూశాక గుండెపోటుతో మృతిచెందలేదని.. ఏదో తేడా ఉందని గుర్తించాను. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి.. ఈ నలుగురూ వివేకా గుండెపోటుతో చనిపోయారని అప్పటికే అందరికీ చెప్పటంతో నేను నా అభిప్రాయాన్ని ఎవరి వద్దా వ్యక్తం చేయలేదు.

ఆధారాలు ధ్వంసం చేయటం నచ్చలేదు

ఘటనా స్థలంలో పరిస్థితులు చూస్తే వివేకాది హత్యేనని నిర్ధారణ అవుతున్నా.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించటం, అక్కడున్న రక్తపు మడుగు, మరకలను శుభ్రం చేయించి ఆధారాలు ధ్వంసం చేయటం నాకు నచ్చలేదు. ఈ వ్యవహారంలో వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల ప్రమేయాన్ని నేను కొట్టిపారేయలేను. వివేకా బెడ్‌రూమ్‌లోకి నేను వెళ్లేసరికి ఓ పనిమనిషి అక్కడ రక్తపు మడుగు శుభ్రం చేస్తూ కనిపించారు. త్వరగా శుభ్రం చేయాలని శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రక్తపు మడుగును శుభ్రం చేయించేందుకు వారంతగా తొందరపడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘సార్‌ శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలాన్ని ఎందుకు శుభ్రం చేయిస్తున్నారు? ఆధారాలు ధ్వంసం చేసేస్తే కేసు మరింత క్లిష్టమైపోతుంది’ అని ఆయన నాతో అన్నారు.

ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలతో కూడిన బెడ్‌షీట్‌ను తొలగించి, దాన్ని మూలన పడేశారు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి బెడ్‌రూమ్‌కి, బయటకి పదే పదే తిరుగుతూ కనిపించారు. ఆ సమయంలో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆధారాలు ధ్వంసం చేశారు. వారు ఆధారాలు ధ్వంసం చేస్తున్న తీరు చూసి.. నేను ఉద్వేగం నియంత్రించుకోలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేశాను. అదే సమయంలో అక్కడ ఫ్రీజర్‌ బాక్సు కూడా గుర్తించాను. వివేకా గుండెపోటుతో మరణించారనే సిద్ధాంతాన్ని మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనేది తొలుత నాకు అర్థం కాలేదు. రక్తపు మడుగు వెంటనే శుభ్రం చేయాలని పనిమనిషిపై ఒత్తిడి తేవటం, ఆ సమయంలో వారి ప్రవర్తన చూసిన తర్వాత గుండెపోటు ప్రచారాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారనేది తెలిసింది. అక్కడ జరుగుతున్న ఆధారాల ధ్వంసాన్ని ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకే అలా చేశారు.

వివేకా ఓటమిలో క్రియాశీలక పాత్ర పోషించారు

2017 ఎన్నికల్లో వివేకా ఎమ్మెల్సీగా పోటీచేశారు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఆయన్ను ఓడించారు. వారివల్లే ఓడానని వివేకా కూడా ఆ తర్వాత గుర్తించారు.

వివేకానందరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న ప్రతాప్ రెడ్డి.. చనిపోవడానికి వారం ముందు పులివెందులలోని తన కార్యాలయానికి వచ్చి అరగంట పాటు పలు విషయాలపై చర్చించారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. కడప ఎంపీ టికెట్ తనకు లేదంటే షర్మిల లేక విజయమ్మకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వివేకా మాటల్లో కనిపించిందన్నారు.

"అవినాశ్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుందని వివేకా నాతో చెప్పారు. అదే అభిప్రాయం అప్పట్లో ప్రజల్లో కూడా ఉండేది. వివేకానందరెడ్డి మంచి రాజకీయ నాయకుడు. ప్రజల్లో మంచిపేరుంది. వివేకా, ఎర్రగంగిరెడ్డి తరచూ భూమి సెటిల్​మెంట్ కోసం బెంగళూరుకు వెళ్లేవారని టైపిస్టు ఇనాయ్ తుల్లా చెప్పారు. వై.ఎస్.భాస్కర్ రెడ్డికి వివేకానందరెడ్డికి మధ్య చాలా కాలం నుంచి విబేధాలు ఉన్నాయి. వివేకా ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో అతనికి ప్రజల్లో మంచి పేరుందన్నారు. కానీ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి పులివెందుల్లో చిన్నచిన్న పంచాయతీలు, స్థానిక సమస్యలు పరిష్కరించేంత వరకే పరిమితమయ్యారు. వివేకాకు పేరు వస్తుండటంతో భాస్కర్ రెడ్డికి, అవినాశ్ రెడ్డికి సహజంగానే అసూయ ఉండేది. అందులో భాగంగానే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడానికి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ప్రధానపాత్ర పోషించారు." అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రతాప్​ రెడ్డి వెల్లడించారు.

viveka murder case : మాజీ మంత్రి వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించింది వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు మృతదేహాన్ని చూసి బయటకు వచ్చాక మిగిలినవారు లోపలికెళ్లారని.. బెడ్‌రూమ్‌లోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (అవినాష్‌రెడ్డి కజిన్‌) తనపై కేకలు వేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకున్నారని చెప్పారు. వారి రాక ముందే వివేకా మృతదేహానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించానని తెలిపారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలు గదిలో చర్చించుకుంటూ కనిపించారని తెలిపారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలంటూ వారు చెప్పారని వెల్లడించారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు గురువారం వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివి.

"వివేకా ఇంట్లోని రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పారు. ఆ మాటలకు నేను సరిగ్గా స్పందించకపోయేసరికి 3సార్లు గట్టిగా కేకలు వేశారు. గంగిరెడ్డి ఎందుకు అంతలా కంగారు పడుతున్నాడు? రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎందుకు అడుగుతున్నాడు? అంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని ప్రశ్నించా. తనకూ అదే అర్థం కావట్లేదంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత వై.ఎస్‌. భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌. మనోహర్‌రెడ్డిలు వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఇంట్లోకి ఫ్రీజర్‌ బాక్సు తెప్పించారు" -షేక్‌ ఇనయతుల్లా

సీఐ శంకరయ్య బాత్‌రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లగా.. నేను ఆయన్ను అనుసరించా. ఆ సమయంలో అక్కడున్న అల్మారా హ్యాండిల్‌ విరిగి ఉన్నట్లు చూశా. ఇంతకుముందు ఇది విరిగిలేదని శంకరయ్యకు చెప్పా. గోడలపై రక్తపుమరకల్ని గమనించా. వివేకాను ఎవరో చంపేసి ఉంటారని తనకు అనుమానంగా ఉందని సీఐ శంకరయ్యతో చెప్పా. ‘మీ సార్‌ను చంపాలని ఎవరు అనుకుంటారు? కమోడ్‌పై పడిపోయుంటారు. అందుకే తలకు గాయాలై రక్తం వచ్చి ఉంటుంది’ అని ఆయన నాకు ఎదురు సమాధానమిచ్చారు. ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని చూస్తే ఆయన మెడ వంగినట్లు కనిపించింది. దాన్ని తిన్నగా చేయాలని ప్రయత్నించా. ఆ సమయంలో నా వేళ్లు వివేకా పుర్రె లోపలికి వెళ్లాయి. దీంతో నేను ఏడుస్తూ పెద్దగా కేకలు వేశా. తల వెనుక వైపునా తీవ్ర గాయాలున్నట్లు చూశా. ఇదే విషయమై ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పగా.. ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసు ఫిర్యాదు ఇస్తారని తెలిపారు. ఫిర్యాదిస్తే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లాల్సి ఉంటుందని, లేకపోతే అవసరం లేదని సీఐ శంకరయ్య ఆ సమయంలో అక్కడున్నవారితో చెప్పారు. గంగిరెడ్డి నమ్మదగ్గ వ్యక్తి కాదని వివేకా చెప్పారు. -షేక్‌ ఇనయతుల్లా

ఇదీ చదవండి:

Amaravati Farmers Deeksha: జగన్‌ను దారికి తెచ్చే వరకూ పోరాటం ఆగదు.. అమరావతి రైతులు, మహిళలు

Last Updated :Feb 26, 2022, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.