Dargah wall begins at Proddatur: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో దుమారం రేపిన దర్గా జెండాచెట్టు గోడల కూల్చివేత వివాదం సద్దుమణిగింది. పట్టణంలో సోమవారం కూలగొట్టిన ప్రదేశంలోనే ఇవాళ గోడలను పునః నిర్మాణ పనులు వైకాపా కౌన్సిలర్లు చేపట్టారు. దర్గా జెండా చెట్టు గోడల కూల్చివేతతో నిన్న అధికార పార్టీ మైనారిటీ కౌన్సిలర్లు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటచేసుకుంది. అయితే.. కూలగొట్టిన గోడలు పునః నిర్మిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇవాళ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఖాజా, 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ గౌస్, మైనారిటీ నాయకులు దర్గా జెండాచెట్టు గోడల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రొద్దుటూరు పురపాలికకు చెడ్డపేరు తెవొద్దంటూ కమిషనర్ రమణయ్యను స్థానిక తెదేపా మాజీ కౌన్సిలర్ తనయుడు ఖలీల్ వేడుకున్నారు.
దర్గా జెండాచెట్టు గోడల కూల్చివేతపై తెదేపా నాయకులు పురపాలక కమిషనర్ రమణయ్యను కలిశారు. ఎలాంటి సమాచారం లేకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా దర్గా జెండాచెట్టు గోడలను ఎలా కూల్చి వేశారంటూ తెదేపా ప్రొద్దుటూరు బాధ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు రాజ్యాంగం నడుస్తోందని ప్రవీణ్ మండిపడ్డారు. దర్గా జెండాచెట్టు కూల్చివేతలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. వైకాపా మైనారిటీ కౌన్సిలర్లను పురమాయించి అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. అంతకుముందు కమిషనర్ను కలిసేందుకు కార్యాలయంలోకి వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రవీణ్ అనుచరులు నినాదాలు చేశారు.
కమిషనర్ కాళ్లు పట్టుకున్న ఖలీల్..: ప్రొద్దుటూరు తెదేపా మాజీ కౌన్సిలర్ తనయుడు ఖలీల్.. పురపాలక కమిషనర్ కాళ్లు పట్టుకున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రొద్దుటూరు పురపాలికకు చెడ్డపేరు తెవొద్దంటూ వేడుకున్నారు. దర్గా జెండాచెట్టు కూల్చివేత ఘటనలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బ తీయొద్దంటూ ఖలీల్ వేడుకున్నారు.
ఇదీ చదవండి: