ETV Bharat / state

బాలిక సాహసం.. బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Mar 24, 2023, 1:58 PM IST

Police Stopped Child Marriage: ఓ బాలికకు తెలియకుండా బాల్య వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. అందుకోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాలిక సాహసం చేసి.. నేరుగా వెళ్లి డీఎస్పీకి ఈ వ్యవహారంపై ధైర్యంగా ఫిర్యాదు చేసింది. ఈ అరుదైన సంఘటన వైయస్సార్ కడప జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే?..

police stopped child marriage on girl complaint
బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

Police Stopped Child Marriage: కడప జిల్లాలో ఓ అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు తెలియకుండా.. ఆమె తల్లిదండ్రులు తనకు బాల్య వివాహం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న బాలిక ఈ వ్యవహారంపై నేరుగా వెళ్లి డీఎస్పీకి ధైర్యంగా ఫిర్యాదు చేసింది. డీఎస్పీ దిశ సిబ్బందిని పంపించి బాల్య వివాహానికి చేస్తున్న యత్నాలను అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళ్తే..

కడప రామకృష్ణ నగర్​కు చెందిన కేశవకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వారిలో ఒక అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇంకా 18 ఏళ్లు కూడా నిండలేదు. అయితే ఆ బాలికకు తెలియకుండా ఆమెను సమీప బంధువు కుమారుడుకి ఇచ్చి బాల్య వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, ఆ బాలికకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఆమెకు చదువుపై ఆసక్తి ఉంది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తుండడంతో ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక ఉండిపోయింది.

అయితే పది రోజులు క్రిందట బాలిక చదువుతున్న పాఠశాలలో దిశా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు బాల్య వివాహాలు చేయడం నేరం.. ఎవరికైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ఆ బాలిక ఎలాగైనా పోలీసులను సంప్రదించాలని నిర్ణయించుకుంది. గురువారం బాలిక తల్లిదండ్రులు పెళ్లి సామాగ్రి కోసం బజారుకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన బాలిక నేరుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి డీఎస్పీ వాసుదేవన్​కు ఫిర్యాదు చేసింది.

తక్షణం స్పందించిన ఆయన దిశ సిబ్బందిని రామకృష్ణ నగర్​కు పంపించి బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండేంత వరకు పెళ్లి చేయకూడదని.. అలా చేస్తే చట్టరీత్యా నేరమవుతుందని డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి.. అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పారు. ఎవరైనా బాలవివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.