ETV Bharat / state

బ్యారేజీ కాదు ఆర్టీసీ గ్యారేజీ! - వర్షం నీళ్లలో ఏళ్ల తరబడి మెకానిక్​ల అవస్థలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 3:27 PM IST

Kadapa_RTC_Garage
Kadapa_RTC_Garage

Kadapa RTC Garage: ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కొద్దిపాటి వర్షానికే ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తోంది. నూతన గ్యారేజీ భవనం పనులు నత్త నడకన నడుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ మెకానిక్​లు తప్పని పరిస్థితుల్లో గంటల తరబడి ఆ నీటిలోనే విధులు నిర్వహించి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నామని వాపోయారు.

Kadapa RTC Garage: కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. గత కొన్నేళ్ల నుంచి వెంటాడుతుంది. వర్షం నీరు ఒక్కసారి గ్యారేజ్​లోకి చేరితే కనీసం నాలుగైదు రోజులపాటు అలాగే నిల్వ ఉంటాయి. మెకానిక్​లు ఆ నీటిలోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది.

బస్సులు గంటల తరబడి గ్యారేజీ నీటిలో ఉండటంవల్ల టైర్లు దెబ్బతింటున్నాయి. దీంతో మార్గమధ్యలో బస్సులు మోరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నీళ్లలో నిలబడి మరమ్మతులు చేయలేక మెకానిక్​లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిలో ఉన్న ఆర్టీసీ గ్యారేజీ మరెక్కడో కాదు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!

కడపలో ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తోంది. మిగ్​జాం తుపాన్​ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప ఆర్టీసీ గ్యారేజీలో మోకాళ్లోతు నీళ్లు చేరాయి. ఇలా వర్షం కురిసిన ప్రతిసారి నీళ్లు రావడం పరిపాటిగా మారింది. ఇక్కడ 150 బస్సు సర్వీసులు 100మందికి పైగా మెకానిక్​లు విధులు నిర్వహిస్తుంటారు. వర్షం వస్తే చాలు కార్మికులు ఆ నీటిలోని నిలబడి బస్సుల మరమ్మతులు చేయాల్సి వస్తుంది.

విష కీటకాలతో మెకానిక్​లు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు టైర్లు గంటల తరబడి నీటిలో ఉండడం వల్ల అవి మార్గమధ్యలో మోరాయిస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు 2021లో ఆర్టీసీ గ్యారేజ్​ను పరిశీలించిన సమయంలో వర్షపు నీటిలో మెకానిక్​ల పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పక్కనే కొత్త గ్యారేజీ నిర్మాణానికి 2022 జనవరిలో భూమి పూజ చేశారు.

ఆర్టీసీ విలీనం పేరుతో ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వం మోసం చేసింది : తులసీరామ్‌

2022 డిసెంబర్​ సమయానికి పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టారు. అయితే రెండేళ్లయినా ఇప్పటికీ కొత్త గ్యారేజీ నిర్మాణ పనులు సగం మాత్రమే పూర్తయ్యాయి. కేవలం గదులను నిర్మించి షెడ్లను నిర్మించారే తప్ప బస్సులను మరమ్మతులు చేసే వివిధ విభాగాలు, ప్లాట్ ఫారాలు తదితర నిర్మాణాలు జరగలేదు.

విద్యుత్తు సరఫరా వంటి చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయి. గుత్తేదారునికి 2 కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉండడంతో ఆయన పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మెకానిక్​లు పాత గ్యారేజ్​లో అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి మాత్రం తన సొంత నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో అత్యాధునికమైన బస్టాండు నిర్మించారు. సొంత నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ జిల్లా కేంద్రమైన కడప ఆర్టీసీ గ్యారేజీ నిర్మాణంపై లేకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం గ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.