ETV Bharat / state

వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణ వాయిదా.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌

author img

By

Published : Feb 10, 2023, 12:03 PM IST

Updated : Feb 10, 2023, 12:39 PM IST

YS Viveka Case
YS Viveka Case

11:58 February 10

వచ్చేనెల 10వ తేదీకి విచారణ వాయిదా వేసిన సీబీఐ కోర్టు

CBI ON YS VIVEKA MURDER : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. ఉమాశంకర్‌రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయినందున మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది.

ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్‌ కేటాయించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 10 (నేడు)న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి ఇప్పటికే తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 10, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.