ETV Bharat / state

వివేకా హత్య కేసు.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంగంలోకి సీబీఐ

author img

By

Published : Sep 20, 2022, 5:22 PM IST

CBI ENQUIRY ON VIVEKA MURDER
CBI ENQUIRY ON VIVEKA MURDER

VIVEKA MURDER CASE: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

CBI ENQUIRY RESTARTS ON VIVEKA MURDER : మాజీమంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. 6 నెలల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ విచారణ చేపట్టారు. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ సమక్షంలో అనుమానితులను ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఇనయతుల్లాను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది.

2019 మార్చి 19న రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని మొదటగా ఫోటోలు వీడియోలు తీసింది ఇనయాతుల్లానే. ఆ వీడియోలను ఇతరులకు తన మొబైల్ ద్వారానే పంపాడు. ఈ విషయంపైనే సీబీఐ అధికారులు అతన్ని విచారించినట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని ఎవరు శుభ్రం చేశారనే దానిపైన సుదీర్ఘంగా ప్రశ్నించారు. గతంలో కూడా అనేకమార్లు సీబీఐ అధికారులు.. అతన్ని విచారణకు పిలిచారు.

YS VIVEKA CASE UPDATE : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్టున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

విచారణలో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు సంస్థ అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు చేయడంతోపాటు.. క్రిమినల్‌ కేసులు పెట్టి విచారణకు ఆటంకం కల్పిస్తున్నారని వివరించారు. కావున విచారణ తెలంగాణ లేదా దిల్లీ సహా దేశంలో మరేదైనా హైకోర్టు పరిధిలో దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవని శివశంకర్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 140 మంది వరకు సాక్షులు ఉన్నారని.. వారందరిని అంత దూరం ఎలా పిలుస్తారని అనగా.. ఆ విషయం ఏదో సీబీఐనే చెప్పనీయండి అని ధర్మాసనం అభిప్రాయపడింది. సునీత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణ అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టుకు శివశంకర్​రెడ్డి: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.