ETV Bharat / state

బంతి.. బంతికీ బెట్టింగ్‌

author img

By

Published : Oct 7, 2020, 3:50 PM IST

క్రికెట్‌ అభిమానులను ఐపీఎల్‌ ఎంతవరకు అలరిస్తోందో తెలియదు కానీ.. పందేలు నిర్వహించే జూదరులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ కోసమే ఐపీఎల్‌ అనే స్థాయిలో బుకీలు భారీగా సంపాదిస్తున్నారు. పందేలు కాస్తున్న వారు జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. బెట్టింగ్‌లో 10 శాతం మంది సంపాదిస్తుంటే.. 90 శాతం మంది నష్టపోతున్నారు. పోలీసులు అడపాదడపా దాడులకు పరిమితమవుతున్నారే తప్ప కఠినచర్యలు తీసుకోలేకపోతున్నారని ఆరోపణ బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, సాంకేతిక కారణాలతో పోలీసులు బెట్టింగ్‌రాయుళ్ల భరతం పట్టలేకపోతున్నారని తెలుస్తోంది.

Increased racing in West Godavari district
బంతి.. బంతికీ బెట్టింగ్‌

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం శివారు గ్రామానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌కు బానిసయ్యాడు. రూ.2 లక్షలు అప్పు చేసి బెట్టింగ్‌లు కాశాడు. జేబు ఖాళీ కావడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమయానికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, లింగపాలెం, రంగాపురం, భోగోలు గ్రామాల కేంద్రంగా ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌కు రూ.25 లక్షల మేర బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, దెందులూరు, విజయరాయి తదితర మెట్ట మండలాల ప్రధాన కూడళ్లలో క్రికెట్‌ బుకీలు చరవాణుల ద్వారా ఈ దందా సాగిస్తున్నారు. మెట్ట మండలాల్లో రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల మేర బెట్టింగులు జరుగుతున్నట్లు అంచనా.

చేతికి మట్టి అంటకుండా..

బుకీలు తమ చేతికి మట్టి అంటకుండా నూతన విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రధాన బుకీలు తమ కింద ఉండే ఉప బుకీల ద్వారా బోర్డు ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఉంటే సరిపోతుంది. వారికి రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుంది. మద్యం, బిర్యానీ అందిస్తారు. బుకీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతా గుట్టుగా జరిగిపోతుంది.

జిల్లావ్యాప్తంగా ప్రధాన బుకీలు కనీసం 100 మంది, వారి కింద సబ్‌ బుకీలు వెయ్యి మంది వరకు ఉంటారని అంచనా. గతంలో మాదిరిగా కంప్యూటర్లు, స్థావరాలు ప్రస్తుతం లేవు. పోలీసులకు దొరక్కుండా కేవలం చరవాణిలో రికార్డింగ్‌ల ఆధారంగా దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు క్రికెట్‌ బెట్టింగుల తీవ్రత అధికమవుతోంది.

గ్రామాల్లోనూ..

గ్రామీణ యువత చరవాణుల్లో క్రికెట్‌ బెట్టింగులు ఆడుతూ అప్పుల పాలవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట మండలాల్లో బెట్టింగ్‌ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువకుల నుంచి సాధారణ వ్యక్తులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇందులో భాగస్వాములు అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలలో బెట్టింగులు అధికంగా జరిగేవి. ఇప్పుడు మెట్ట మండలాలకూ ఈ సంస్కృతి విస్తరించింది. ఇతర దేశాల్లో బెట్టింగ్‌కు అనుమతులున్నందున కొన్ని కంపెనీలు ముందుకు రావడంతో బుకీలు రెండో కంటికి తెలియకుండా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఆయా సైట్లను తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా నిషేధించాలని కోరుతున్నా స్పందన లేదు. టీవీల్లో వచ్చే మ్యాచ్‌కు యాప్‌లో వచ్చే మ్యాచ్‌కు ఒక బాల్‌ తేడా ఉంటుంది. బుకీలకు ముందుగానే ఆట తెలుస్తుంది. బుకీలు బాల్‌ బాల్‌కి ఆడే బెట్టింగ్‌లో జరిగే ఆటను ముందుగానే ఆ యాప్‌లో చూసి అమాయకులను దోచేస్తున్నారు.

సత్వరం చర్యలు తీసుకుంటాం

జిల్లాలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. బెట్టింగ్‌ చట్ట వ్యతిరేక కార్యక్రమం. జిల్లాలో ఎక్కువ బెట్టింగులు జరిగే ప్రాంతాలను గుర్తించాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. - నారాయణ నాయక్‌, ఎస్పీ

ఇదీ చదవండి:

'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.