ETV Bharat / state

పునరుజ్జీవంతో పూర్వకళను సంతరించుకున్న దోమకొండ గడీకోట

author img

By

Published : Dec 1, 2022, 8:50 PM IST

దోమకొండ గడీకోట
దోమకొండ గడీకోట

Domakonda Fort: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో సంస్థానాధీశుల వారసత్వ సంపదైన దోమకొండ గడీకోట పునర్జీవం పోసుకుంది. సంస్థానం భారతదేశంలో విలీనం తరువాత వారసులు రాజధానికి మకాం మార్చడంతో ఇక్కడి ప్రాకారాలు, కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో వారసుల్లో ఒకరైన అనిల్ కుమార్ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో కూతురు ఉపాసన నిశ్చితార్థం సినీనటుడు రామ్‌చరణ్‌తో ఇక్కడే జరపడంతో ఈ కోట అందరి దృష్టిని ఆకర్షించింది. నాటి నుంచి 11 ఏళ్లుగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. వారి కృషి ఫలితంగా గడీకోట యునెస్కో గుర్తింపు పొంది ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఖ్యాతినార్జించింది.

Domakonda Fort: 15వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు దోమకొండ సంస్థానం హిందూ సంస్కృతితో విరాజిల్లింది. బ్రహ్మనీ సుల్తాన్ పిలుపుతో భిక్కనూరును రాజధానిగా చేసుకుని కామినేని వంశీయుడైన కామిరెడ్డి పరిపాలించారు. తర్వాత రామారెడ్డి, దోమకొండ రాజధానులుగా కొనసాగాయి. సోమేశ్వర్రావు హయాంలో 1948 సెప్టెంబరు 17న దోమకొండ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. వారసుల్లో ఒకరైన ఉమాపతిరావు ఐఎస్​గా పని చేశారు. ఆయన కుమారుడు అనిల్ కుమార్.. ఆపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కూతురు శోభనను వివాహం చేసుకున్నారు.

యునెస్కో అవార్డు: వీరి కూతురు ఉపాసన సినీనటుడు చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ నిశ్చితార్ధం, పెళ్లి వేడుక సందర్భంగా దోమకొండ గడీకోట ప్రాచుర్యంలోకి వచ్చింది. 2022 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు కోసం వివిధ దేశాల నుంచి మొత్తం 387 ప్రతిపాదనలు వచ్చాయి. అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసింది. దోమకొండ కోట ప్రైవేట్ నిర్మాణమైనప్పటికి సాంస్కృతిక స్థలంగా పునరుద్ధరించినందున యునెస్కో అవార్డుకు ఎన్నికైనట్లు దోమకొండ కోట ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.

17వ శతాబ్దంలో నిర్మాణం: కోట సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉంది. రాజాసోమేశ్వర్రావు 17వ శతాబ్దంలో గడీకోట నిర్మాణాన్ని ప్రారంభించారు. కుడ్యాలు, ప్రాకారాలు శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడతాయి. అద్దాల బంగ్లా, రాజమహల్ భవనాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాజస్థాన్, జోద్‌పూర్‌ కళాకారులతో దుర్గాలు, ప్రాకారాలు నిర్మించినట్లు చెబుతారు. శివ, వైష్ణవులకు ప్రాధాన్యమిస్తూ ముఖ్యకేంద్రాల్లో శివాలయాలు, రామ మందిరాలు నిర్మించారు.

యునెస్కో గుర్తింపు దక్కడంపై స్థానికుల హర్షం: అద్దాల బంగ్లా అప్పటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్యసేవకు వేదికగా నిలిచింది. కాకతీయ వంశీయురాలైన రాణి రుద్రమదేవి తన జైత్రయాత్రలో భాగంగా ఇక్కడ మహాదేవుని ఆలయం కట్టించినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. కామినేని వంశీయులు ఆరంభం నుంచి మహదేవుణ్ని ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. యునెస్కో గుర్తింపు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు దోమకొండ కోటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలైన రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్​ తేజ్ పలు విందు, వినోదాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను కోటలోనే రెండు రోజుల పాటు మెగా కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. స్థానిక దోమకొండ గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం శివరాత్రి పర్వదినాన కోట శివాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. యునెస్కో గుర్తింపు లభించడం పట్ల కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకంగా గడీకోట విస్తృతమైతే తమకూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దోమకొండ గడీకోట

"మన దోమకొండ కోటకు యూనెస్కో గుర్తింపు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. కామారెడ్డిలో మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దోమకొండ ట్రస్ట్, దోమకొండ గ్రామ పంచాయతీ వారు ప్రత్యేక దృష్టి సారించారు." - జితేష్ వి.పాటిల్, కామారెడ్డి కలెక్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.