ETV Bharat / state

Nandigama Pond Beautification: మారిన నందిగామ చెరువు రూపురేఖలు.. చూస్తే మతిపోవాల్సిందే

author img

By

Published : Jun 22, 2023, 3:22 PM IST

Nandigama Pond Beautification
నందిగామ చెరువు సుందరీకరణ

Nandigama Pond Beautification: ఒకప్పుడు పిచ్చి మొక్కలతో పూడికలు పేరుకుపోయి.. చిత్తడికి చిరునామాగా ఆ చెరువు ఉండేది. కానీ.. ఇప్పుడు నాలుగు వైపులా కంచె, ఆహ్లాదం పంచేలా పూలమొక్కలు, పచ్చని గడ్డి, టైల్స్‌తో ఏర్పాటు చేసిన నడకదారితో ప్రశాతంతకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకంతో పాటు సర్పంచ్​ చొరవతో తమ సరస్సు రూపురేఖలను మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం నందిగామ చెరువు సుందరీకరణ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

నందిగామ చెరువు సొగసులు చూశారా

Nandigama Pond Beautification: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోనూ 75 చెరువులను బాగు చేయాలని సంకల్పించింది. వీటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులను కేటాయించింది. పథకం కింద విజయనగరం జిల్లా భోగాపురం మండలం నందిగామ చెరువుని అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. చెరువు నిర్మాణం, అభివృద్ధి కోసం 3 లక్షల 90 వేల రూపాయల ఉపాధి హామీ నిధులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ.. డ్వామా వెచ్చించింది. ఉపాధి హామీ వేతనదారులతో పనులు చేయించి మట్టిని తొలగించి గట్టును బలోపేతం చేశారు.

అడపాదడపా సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ చెరువుని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నందిగామ సర్పంచ్ మురళీమోహన్ రావు సంకల్పించారు. సుమారు 5లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి చెరువుకు అదనపు హంగులు అద్దారు. చెరువు అడగు భాగంలో రాతికట్ట, నడక దారి, నాలుగు వైపులా కడియం నుంచి తీసుకొచ్చిన 20 రకాల పూలు, అలంకరణ మొక్కలను నాటించారు. గ్రామంలో పది కాలాల పాటు గుర్తుండిపోవాలనే సంకల్పంతో సుందరీకరణ పనులు చేసినట్లు మురళీమోహన్ రావు తెలిపారు. చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఆహ్లాదంగా తీర్చిదిద్దటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ మురళీమోహన్ రావు ప్రత్యేక శ్రద్ధతో.. తమ గ్రామానికి ఒక వినోద కేంద్రంగా సరస్సు మారిందంటున్నారు.

పల్లె ప్రజలకు సాగు, తాగునీటి పరంగా.. ప్రధాన ఆధారమైన తటాకాల అభివృద్ధికి కేంద్రం శ్రీకారం చుట్టడం హర్షణీయమంటున్నారు. అమృత్ సరోవర్ పథకం పేరుతో చేపట్టిన చెరువుని మరింత అందరంగా, ఆకర్షణీయంగా, పలువురికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన సర్పంచ్ మురళీమోహన్ రావును గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఈ స్ఫూర్తితో గ్రామంలో జలసంక్షరణకు మరిన్ని చెరువులు అభివృద్ధి చేస్తానని చెప్పటం హర్షదాయకమంటున్నారు.

"ఈ చెరువు అమృత సరోవర్ పథకంలో భాగంగా ఇటీవలే నిర్మించాము. జలమే జగతికి మూలం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రాజెక్ట్​కు రూపకల్పన చేపట్టాము. ఇప్పుడు ఇది గ్రామంలోని మహిళలకు, యువతకు చాలా ఉపయోగపడుతోంది. ఇది ఒకప్పుడు తుప్పలు, పొదలతో ఉండేది. దీన్ని ప్రభుత్వం చెల్లించిన నిధులతో మాత్రమే కాకుండా మా సొంత నగదును కూడా పెట్టి సుందరీకరణ పనులు చేపట్టాము. దీన్ని చూసిన అధికారులు హర్షం వ్యక్తం చేశారు." -మురళీమోహన్ రావు, నందిగామ సర్పంచ్

"ఈ ప్రాంతం ఇంతకుముందు ముళ్లపొదలు, రాళ్లతో నిండి ఉండేది. ఈ చెరువుకు అమృత సరోవర్ పథకంలో వచ్చిన నిధులతోపాటు మా ప్రెసిడెంట్ తన సొంత నగదును ఖర్చు పెట్టారు. దీన్ని చూసినవారంతా ఇంత సుందరమైన చెరువును ఎక్కడా చూడలేదని అంటున్నారు. దీన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కూడా ప్రశంసించారు." - ఆదిబాబు, భోగాపురం డ్వామా ఏపీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.