ETV Bharat / state

Bhogapuram Airport రెండోసారి శంకుస్థాపనకు సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం

author img

By

Published : May 3, 2023, 7:11 AM IST

Updated : May 3, 2023, 7:26 AM IST

Bhogapuram Airport
Bhogapuram Airport

Foundation Stone for Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి నేడు రెండోసారి శంకుస్థాపన జరగనుంది. దీంతో పాటు తారకరామతీర్ధ సాగర్ పెండింగ్ పనులు, చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ పనులను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అయితే.. విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కాలనీలను పుట్టెడు సమస్యలు వెంటాడుతున్నాయి. పరిష్కారించకుండానే శంకుస్థాపన ఎలా చేస్తారని.. బాధితులు నిలదీస్తున్నారు. విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Foundation Stone for Bhogapuram International Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో 5వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి నేడు మరోసారి భూమిపూజ జరగనుంది. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా.. భారీ విమానాలు దిగేలా 3.8 కిలోమీటర్ల రన్ వే పూర్తి చేయనున్నారు.అయితే.. విమానాశ్రయ నిర్వాసితులకు యుద్ధప్రాతిప‌దిక‌న కాల‌నీల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తున్నామ‌ని అప్పట్లో జిల్లా అధికారులు ప్రకటన చేశారు.

కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని నిర్వాసితులు వాపోతున్నారు. పునరావాస గ్రామాల్లో సుమారు 80 కుటుంబాలు తాత్కాలికంగా వలస వెళ్లాయి. రేషన్ కార్డులనూ వలస వెళ్లిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. రేషన్‌కార్డుల మారిపోయినందున స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించడంలేదని... నిర్వాసితులు వాపోతున్నారు. తమ గోడు ఎవరికీ పట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు.

"ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా వాటిని నెరవేర్చలేదు. ఇక్కడ మాకు సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అలాగే ఇంటర్​, డిగ్రీ పూర్తి అయిన వారికి ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు వాటి గురించి అడుగుతుంటే ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలి"-భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు

విమానాశ్రయానికి భూములిచ్చిన వారికి అర్హత మేరకు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే... అధికారులు పట్టించుకోవటం లేదని నిర్వాసిత కాలనీల యువత, తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇప్పటికే శంకుస్థాపన జరిగిన విమానాశ్రయానికి మరోసారి చేయటం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఇప్పటి వరకు పట్టించుకోక పోయినా... కనీసం ఇప్పుడైనా చిత్తశుద్ధితో గడువులోపు నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

"మరోసారి శంకుస్థాపన చేస్తారంటా. శంకుస్థాపన చేసిన నాలుగు సంవత్సరాలలో ప్రారంభోత్సవానికి రెడీగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారో మాకైతే అర్థం కావడం లేదు. మేము ఈ ప్రాజెక్టును తీసుకురావాడానికి ముఖ్య కారణం యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని. ఒక పనికి పలుమార్లు శంకుస్థాపన చేయడం వైసీపీకి మాత్రమే చెందుతుంది. దయచేసి ప్రజలను మోసం చేయకండి"-అశోక గజపతిరాజు, మాజీ కేంద్ర మంత్రి

విమానాశ్రయానికి భూములిచ్చిన వారికి పరిహారం చెల్లింపులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని నెల్లిమర్ల నియోజకవర్గ తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించడమే కాకుండా విమానశ్రయ నిర్మాణ పనుల వేగంగా పూర్తి చేయాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. రెండోసారి శంకుస్థాపన

ఇవీ చదవండి:

Last Updated :May 3, 2023, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.