ETV Bharat / state

లైన్‌మన్‌ హత్య కేసులో ఉత్కంఠ.. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు

author img

By

Published : Nov 6, 2021, 7:34 AM IST

Updated : Nov 6, 2021, 9:18 AM IST

విశాఖ జిల్లా ఏనుగులపాలెంలో జరిగిన లైన్‌మన్‌ హత్య కేసులో మంత్రి బొత్స మేనల్లుడు పాత్ర ఉందంటూ మృతుని బంధువులు ఆరోపించారు. అతడిని కూడా నిందితుడిగా చేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు.

లైన్‌మెన్‌ హత్యలో ఉత్కంఠ
లైన్‌మెన్‌ హత్యలో ఉత్కంఠ

విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలెం గ్రామంలో జరిగిన లైన్‌మన్‌ మొల్లి బంగార్రాజు(45) హత్యోదంతంలో పరిణామాలు చర్చనీయాంశంగా(twists in lineman murder case in vishakapatnam district) మారాయి. కేజీహెచ్‌ వద్ద శనివారం కూడా ఆందోళన చేయాలని బాధితులు నిర్ణయించడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోనన్న అంశం కలకలం రేపుతోంది.

మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణకుమార్‌ అతిథి గృహం వద్ద సంఘటన జరగడం, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోవింద్‌తో ఆయనకు పరిచయాలుండడంతో లక్ష్మణకుమార్‌ను కూడా నిందితుడిగా చూపాలంటూ మృతుడి భార్య, బంధువులు శుక్రవారం పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోను చేసి బంగార్రాజు కుటుంబీకులతో మాట్లాడారు. అయినా లక్ష్మణరావు అరెస్టు తర్వాతే శవపరీక్షకు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు పోలీసులు కూడా చర్చించినా అదే విషయం స్పష్టం చేశారు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు శుక్రవారం కలెక్టర్‌ మల్లికార్జునను కలిశారు. అయినా న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా కలెక్టరేట్‌ ముట్టడికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడినుంచి చెదరగొట్టడానికి కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.

కలెక్టర్‌ మల్లికార్జునకు విన్నపమిస్తున్న బాధిత కుటుంబీకులు, నేతలు

కన్నీరుమున్నీరు..

డబ్బులిస్తామని పిలిపించి అత్యంత కిరాతకంగా చంపేశారంటూ బంగార్రాజు భార్య నందిని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని రోదించారు. ‘మాకు న్యాయం చేయండి. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేయాలి. లేదంటే వారి పేర్లు రాసి ఇక్కడే చచ్చిపోతాం. నిందితుల అరెస్టే నా డిమాండు’ అంటూ కేజీహెచ్‌ వద్ద కన్నీరుమున్నీరు’గా విలపించారు.

పార్టీలకు అతీతంగా..

బంగార్రాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా మద్దతు పలికారు. తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌, కొందరు వైకాపా నాయకులు, జనసేన భీమిలి ఇన్‌ఛార్జి సందీప్‌, తదితరులు కేజీహెచ్‌ శవాగారం దగ్గరికి వచ్చారు. ‘నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రం చేస్తాం. ఎవరికి ఫోన్‌ చేసినా న్యాయం చేస్తామని మొక్కుబడి మాటలే చెబుతున్నారు’ అని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గురవయ్య యాదవ్‌ పేర్కొన్నారు.

మంత్రులకు వ్యతిరేకంగా..

బంగార్రాజు హత్య కేసులో పోలీసులు, మంత్రులు సరిగా స్పందించడం లేదంటూ...తమకు న్యాయం చేయడంలేదంటూ మృతుడి బంధువులు ప్రదర్శన నిర్వహించారు. ‘బొత్స డౌన్‌ డౌన్‌.... అవంతి డౌన్‌ డౌన్‌’ అంటూ కేజీహెచ్‌ వద్ద చేసిన ర్యాలీ చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో ఈ హత్య జరిగినా పరామర్శించడానికి కూడా మంత్రి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీతోనే మాట్లాడతాం..

బంగార్రాజు మృతదేహానికి శవపరీక్ష పూర్తయిందని సమాచారం. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. డెలివరీ దస్త్రం ఇవ్వనందున శవపరీక్ష పూర్తి కాలేదని తాము భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు కమిషనర్‌తో తప్ప మరో అధికారితో మాట్లాడబోమని యాదవ సంఘం నేతలు చెబుతున్నారు.

పారదర్శకంగా దర్యాప్తు..

‘బంగార్రాజు హత్య కేసును పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కేసుకు అవసరమైన సాక్ష్యాలను, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. హత్యలో ఎవరెవరి ప్రమేయం ఉందో అందరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్​లో చేరుస్తాం’ అని కమిషనరేట్‌ డీసీపీ-1 గౌతమి సాలి పేర్కొన్నారు.

అసలేం జరిగింది..

ఆనందపురం మండలం గొట్టిపల్లిలో బంగార్రాజు విద్యుత్ లైన్​మన్​గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. గత ఆదివారం సాయంత్రం నుంచి బంగార్రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భీమునిపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం ఏనుగులపాలెం పంటపొలాల్లో బంగార్రాజు మృతదేహం లభ్యమైంది.

మృతుడు తన భార్య, పిల్లలతో తగరపువలస సమీపంలో నమ్మివానిపేటలో నివాసం ఉంటున్నారు. బంగార్రాజు మృతి మిస్టరీగా మారడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే డబ్బులిస్తామని పిలిపించి అత్యంత కిరాతకంగా చంపేశారంటూ బంగార్రాజు భార్య నందిని ఆరోపిస్తున్నారు. ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని రోదించారు. ‘మాకు న్యాయం చేయండి. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేయాలి.. లేదంటే వారి పేర్లు రాసి ఇక్కడే చచ్చిపోతాం. నిందితుల అరెస్టే నా డిమాండు’ అంటూ కేజీహెచ్‌ వద్ద కన్నీరుమున్నీరు’గా విలపించారు.

ఇదీ చదవండి:

అనుమానాస్పద స్థితిలో లైన్​మెన్ మృతి...కేసు నమోదు

Last Updated : Nov 6, 2021, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.