విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండగా... 35 గ్రామాల్లో దాదాపు 20 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. తుపానులు ఏర్పడినప్పుడు వీరిని రక్షించేందుకు ... నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం మండలాల్లో 11 తుపాను రక్షిత భవనాలను నిర్మించారు. ఒక్కొక్క భవనానికి దాదాపు కోటిన్నర ఖర్చు చేసి...కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ వీటిని నిర్మించింది. తుపాను సూచనలను ముందుగానే గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శాటిలైట్ సిగ్నల్ పరికరాలను భవనాల పైభాగంలో అమర్చారు. అన్ని సౌకర్యాలు ఉన్నా నిర్వహణ లోపంతో... ఈ భవనాలు ప్రస్తుతం ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయి.
తుపాను రక్షణ భవనాల్లో కనీస సాకర్యలు కరవయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటర్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. కాపలాదారులు లేకపోవడంతో విద్యుత్ పరికరాలను దొంగలించారు. తెగిపోయి వేలాడుతున్న వైర్లు, తిరగని ఫ్యాన్లు... వెలగని దీపాలు ఈ భవనాల్లో దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లలోనికి వెళ్లేందుకు కనీసం సాహసించలేనంత అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో పాత భవనాలు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రక్షణ భవనాల నిర్వహణ పట్ల చొరవ చూపకుంటే... రాబోయే కాలంలో కష్టాలు తప్పవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపానుల నుంచి రక్షించేందుకు నిర్మించిన పునరావాస భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు .