రుషికొండను తొలిచారు.. జియో మ్యాటింగ్ పరిచారు

author img

By

Published : Feb 4, 2023, 11:00 PM IST

పచ్చదనానికి జియో మ్యాటింగ్
పచ్చదనానికి జియో మ్యాటింగ్ ()

Geomatting on Rishikonda: రిషికొండ.. ఓ వైపు సంద్రాన అలల సవ్వడి.. మరోవైపు పచ్చదనం పెరగాలి.. వైజాగ్ నగరానికి వన్నె తెచ్చే ఈ ప్రాంతం కొన్నాళ్లుగా విధ్వంసానికి గురవుతోంది. పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించేలా కొండను తొలచివేయడం ప్రకృతి ప్రేమికులను కలచివేస్తోంది. వచ్చే నెలలో ఇక్కడ జి-20 సదస్సు జరగనుండగా.. కొండ ప్రాంతానికి కృత్రిమ రంగులు అద్దుతున్నారు. తవ్వకాల గాయాలు కనిపించకుండా జియో మ్యాటింగ్ పనులు చకచకా కొనసాగిస్తున్నారు.

పచ్చదనానికి జియో మ్యాటింగ్

Geomatting on Rishikonda : దేశవ్యాప్తంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలకు ప్రబల తార్కాణంగా నిలుస్తున్న రుషికొండ ప్రాంతం ఇప్పుడు హరితంగా కన్పించేందుకు అధికార యంత్రాంగం తంటాలు పడుతోంది. వచ్చే నెలలో జరగనున్న జి-20 సదస్సుకు వచ్చే ప్రతినిధుల కంట ఇది ఆకుపచ్చగా కనిపించేలా రూపొందించడానికి జర్మన్ టెక్నాలజీతో జియో మేటింగ్ చేస్తున్నారు.

న్యాయస్థానాల్లో కేసులెన్నో.. : కొండను బొడిగుండులాగా తొలిచేయడంపై ఇప్పటికే అటు ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల కంటే ఎక్కువగా కొండను తొలచిందని.. దీనిపై గూగుల్ మ్యాపులను సాక్ష్యంగా పరిగణించాలని న్యాయస్థానంలోనూ అభ్యర్థనలున్నాయి. ఈ తరుణంలో ఒకవైపు ఏపీటీడీసీ ఇక్కడ భవన సముదాయాలను సిద్ధం చేస్తోంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీటిని ప్రభుత్వం ఎక్కడా తోసి పుచ్చకుండా మంత్రులు మాత్రం రుషికొండపై ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటే తప్పేంటన్న వాదనలు కూడా వినిపించడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

ఆకు పచ్చగా కనిపించేలా : ఇంటీరియర్ కోసం ఇప్పటికే ఒక సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. బ్లాకుల వారీగా ఇవి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో జియో మ్యాటింగ్ ద్వారా ఈ కొండతా పచ్చగా ఉండేట్టుగా చేస్తున్నారు. తొలుతగా ఇక్కడ ఒక ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఈ మేట్​ను పరిచారు. అక్కడ వృక్షజాలం పచ్చదనం పెరగడం కోసం ఇది తోడ్పడే విధంగా ఇందులో పోషకాలు ఉంటాయని అధికార యంత్రాంగం చెప్పుకువస్తోంది. ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికి ఇది మంచి ఫలితాలను ఇస్తుండడంతో ఒకవైపు అంతా ఇది పరిచే పనిని చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన భాగాల్లోనూ ఇదే తరహాలో పరుస్తామని చెబుతున్నారు. దీనివల్ల తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, పచ్చదనం కూడా అక్కడ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సత్ఫలితాలివ్వడంతోనే.. : జి20 సదస్సును దృష్టిలో పెట్టుకుని ఇవి చేయడం లేదని, కొండ పరిరక్షణలో భాగంగానే చేయాలని నిర్ణయించామన్నది వారి వాదన. తొలుత ప్రయోగాత్మకంగా రెండు నెలల క్రితమే చేశామని, చిన్న ప్రాంతంలో చేసి, అది మంచి ఫలితం ఇవ్వడంతోనే మిగిలిన ప్రాంతమంతా విస్తరిస్తున్నామని వివరిస్తున్నారు. బయట చూపరులకు మాత్రం కొండ పచ్చగా ఉన్నట్టు దర్శనమివ్వడం కోసమే ఈ యత్నమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.