ETV Bharat / state

విశాఖ భూ కుంభకోణంలో 8 మంది ఐఏఎస్‌లు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిన వైనం

author img

By

Published : Oct 30, 2022, 9:25 AM IST

IAS Officers: విశాఖ జిల్లాలో మాజీ సైనికోద్యోగుల పేరిట భూములు కాజేసిన కుంభకోణంలో ఐఏఎస్​ల అడ్డగోలు వ్యవహారాలను 2017లో ఏర్పాటు చేసిన సిట్‌ బట్టబయలు చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. లవ్‌ అగర్వాల్‌, గిరిజాశంకర్‌, ప్రవీణ్‌కుమార్. ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న లవ్ అగర్వాల్ 2011 జూన్ 17 నుంచి 2012 ఆగస్టు 28 వరకూ విశాఖ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌ కుమార్, ఏపీ పన్నుల విభాగం చీఫ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న గిరిజాశంకర్‌ అప్పట్లో విశాఖ సంయుక్త కలెక్టర్లుగా ఉన్నారు.

IAS Officers Scam
ఐఏఎస్​ అధికారుల అవినీతి

IAS Officers Scam: దాకవరపు రాములకు రాజకీయ బాధితుడి విభాగం కింద 1978లో కొమ్మాదిలోని సర్వే నంబరు 28/2 లో రాష్ట్ర ప్రభుత్వం 10.18 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమి అమ్మకానికి ఎన్​ఓసీ ఇవ్వాలని రాములు కుమారుడు శంకర్రావు దరఖాస్తు చేసుకోగా.. 2012 ఆగస్టు 28న ఎన్​ఓసీ ఇచ్చేశారు. విశాఖ కలెక్టర్‌గా లవ్ అగర్వాల్‌కు.. అదే చివరి పని దినం కాగా ఆగస్టు 23న ఆర్డీవోను పిలిపించి అదే రోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ద్వారా 28వ తేదీన నివేదిక చేరగా.. నిషేధిత భూముల జాబితా నుంచి సదరు భూమిని తొలగిస్తూ.. ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి 2005 వరకూ రాములు పేరుతో ఎలాంటి అసైన్డ్ భూమీ కేటాయించలేదు. ఎన్​ఓసీ జారీపై నిషేధం ఉన్నా.. లవ్ అగర్వాల్ తన చివరి పనిదినం రోజున అనుమతి జారీ చేశారు. ఈ లావాదేవీల ద్వారా చివరికి నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి కుమారుడైన జి. శ్రీనివాసరెడ్డి లబ్ధి పొందారని సిట్ తేల్చింది. ఇదంతా పథకం ప్రకారం సాగిందని సిట్​ పేర్కొంది.

ఇక కాపులుప్పాడలోని సర్వే నెంబర్ 248/2లో రాగతి అచ్చెన్నకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించిన మూడున్నర ఎకరాలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ ఆయన భార్య రాగతి ఎల్లాయమ్మ 2005లో కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో కనీసం ప్రాథమిక పరిశీలన కూడా చేయలేదు. రెవెన్యూ రికార్డుల పరంగా చూస్తే అవి నకిలీ పట్టాలనితెలుస్తున్నా ప్రవీణ్ కుమార్, లవ్ అగర్వాల్ పరిశీలన చేయకుండా ఎన్​ఓసీ జారీ చేశారు. ఆ సమయంలో భూముల విక్రయానికి సంబంధించి నిరభ్యంతర పత్రాల జారీ చేయడంపై నిషేధం అమల్లో ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. ఈ వ్యవహారంలో లవ్‌ అగర్వాల్, ప్రవీణ్‌కుమార్‌పై ప్రభుత్వం తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని సిట్‌ సిఫార్సు చేసింది.

విజయనగరం జిల్లా తెల్లాం మండలానికి చెందిన బత్తుల గోపాల్‌కు బక్కన్నపాలెంలో 43/2 సర్వే నెంబర్లో కేటాయించిన 4.88 ఎకరాల అసైన్డ్ భూమి అమ్ముకునేందుకు లవ్ అగర్వాల్ ఎన్​ఓసీ జారీ చేశారు. కలెక్టర్‌ ఎన్​ఓసీ ఇచ్చిన రోజే ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని సిట్‌ పేర్కొంది. వీఆర్​ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్టనర్ ఎన్.శంకర్రావు సదరు భూమి కొనుగోలుకు 2005లోనే గోపాల్ కుటుంబ సభ్యులకు 10 లక్షలు రూపాయలు అడ్వాన్సు ఇచ్చి వారి వద్ద పత్రాలు తీసుకున్నారు. ఆ తర్వాత శంకర్రావు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై గోపాల్ భార్య ఆదిలక్ష్మి పేరిట నకిలీ పాస్‌పుస్తకం సృష్టించి.. రెవెన్యూ రికార్డుల్లో చేర్పించారు. అలా ఆదిలక్ష్మి పేరుకు మారిన ఆ భూమిని.. అమ్ముకునేందుకు లవ్‌ అగర్వాల్‌ ఎన్​ఓసీ ఇచ్చేశారు. భూములు అమ్ముకునేందుకు, అవకాశం కల్పించే దస్త్రాన్ని లవ్ అగర్వాల్, గిరిజా శంకర్‌ 6 వారాల్లోనే పరిష్కరించారని సిట్‌ గుర్తించింది. వీరిద్దరి పాత్రను ప్రభుత్వం పరిశీలించాలని పేర్కొంది. అయితే తహసీల్దార్, ఆర్డీవోలు ఇచ్చిన నివేదికలు పరిశీలించాకే ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అంగీకరించామని.. ఎలాంటి అత్యుత్సాహంగానీ, అలసత్వంగానీ లేదని లవ్ అగర్వాల్, ప్రవీణ్ కుమార్ సిట్‌కు వివరణ ఇచ్చుకున్నారు. సిట్‌ మాత్రం.. లవ్ అగర్వాల్, ప్రవీణ్ కుమార్‌ సహా రెవెన్యూ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించి.. విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అయ్యేందుకు సహకరించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

విశాఖ భూ అక్రమాల్లో మరో పాత్రధారుడు ఐఏఎస్​ ఎస్‌.సత్యనారాయణ. 2005 జులై 22 నుంచి 2008 మే 21 వరకూ.. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఆయన ఆ సమయంలోనే కొన్నాళ్ల పాటు ఇంఛార్జ్‌ జాయింట్ కలెక్టర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్నారు. నిబంధనల ప్రకారం కలెక్టర్లకు మాత్రమే.. భూముల అమ్మకానికి ఎన్​ఓసీ ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ, సత్యనారాయణ ఇంఛార్జ్ జేసీ హోదాలో మంజూరు చేశారు. పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో.. 11 మంది విశ్రాంత సైనికోద్యోగుల పేరిట వివిధ సర్వే నెంబర్లలో కేటాయించిన 34.56 ఎకరాల భూమిలో అత్యధిక భాగాన్ని విక్రయించేందుకు వీలుగా సత్యనారాయణ..ఏకంగా 9 ఎన్​ఓసీలు జారీ చేశారు. సదరు భూములన్నీ చివరికి చేతులు మారి.. ధర్మాన బంధుగణం, మిత్ర బృందం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రామదాస్, సన్నిహితుడు ఐబీ కుమార్‌ డైరెక్టర్లుగా ఉన్న.. ఓంకాన్‌ రియల్టర్స్, కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ సంస్థలు ఈ ఎన్​ఓసీల ద్వారా అంతిమ లబ్ధి పొందాయి. ఈ వ్యవహారం అంతా ఒక కుట్ర ప్రకారం జరిగిందని సిట్ తేల్చింది. రిజిస్టర్ ఫైళ్లు అందుబాటులో లేకపోయినా.. పరవాడ తహసీల్దారు, విశాఖ ఆర్డీఓ కళ్లు మూసుకుని క్లియరెన్స్‌ ఇచ్చేశారని సిట్ గుర్తించింది. అయితే ఇంఛార్జ్‌ జేసీగా ఉండి ఎన్​ఓసీ ఎలా ఇచ్చారని సత్యనారాయణను సిట్‌ ప్రశ్నించింది. ఆ అధికారం ఇంఛార్జ్‌ జేసీగా ఉన్న రెవెన్యూ అధికారికి ఉందా లేదా అనేది నిబంధనల్లో ఎక్కడా నిర్వచించలేదని సత్య నారాయణ సమాధానం ఇచ్చారు. 1968 నాటి జాబ్‌చార్ట్‌ ప్రకారం భూములకు సంబంధించిన వ్యవహారాలన్నీ జేసీ పరిధిలోకి వస్తాయని, కాబట్టి అలాంటి దస్త్రాలేవీ తనకు పంపించాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పినందునే.. ఇంఛార్జ్‌ జేసీ హోదాలో తాను ఎన్​ఓసీ లు ఇచ్చానని సత్యనారాయణ సిట్‌కు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు సమాధానాలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సిట్‌ పేర్కొంది.

చట్టాన్ని పక్కనపెట్టి ధర్మాన చెప్పినట్లు చేసుకుంటూ పోయిన మరో ఐఏఎస్​ జె.శ్యామలరావు. 2009 జూన్ 18 నుంచి 2011 జూన్ 17 వరకూ విశాఖ కలెక్టర్‌గా పనిచేశారాయన. ప్రస్తుతం ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మాజీ సైనికోద్యోగుల పేరిట ఉన్న డీ ఫామ్ పట్టాల భూమి అమ్ముకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూముల్లో ఎక్కువ భాగం.. అప్పటి, ఇప్పటి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు, సన్నిహితుల చేతుల్లోకి వెళ్లినట్లు సిట్‌ తేల్చింది. పరవాడ మండలం పెదముషిడివాడలో మాజీ సైనికోద్యోగుల కోటాలో 437/1 సర్వే నెంబర్లో సింహచలం పేరిట ఉన్న 5.14 ఎకరాలు, సన్యాసిరావు పేరిట సర్వే నెంబర్ 441/1లో ఉన్న 4.65 ఎకరాలు, సత్యాడ అప్పారావు పేరిట.. సర్వే నెంబర్ 437/2లో ఉన్న 3.95 ఎకరాల విక్రయానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారు. ఈ భూములను తొలుత ధర్మాన ప్రసాదరావు సన్నిహితుడైన ఐబీ కుమార్ భార్య, కోరమాండల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జి.ప్రసన్న కొనుగోలు చేయగా.. ఆ తర్వాత అందులో కొంత భూమిని ధర్మాన ప్రసాదరావు స్నేహితులు గోవింద సత్యసాయి, జాస్తి భాస్కరరావు, మరో బంధువు కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు రిజిస్టర్‌ దొరకలేదు. అసైన్‌మెంట్‌ రిజిస్టర్‌లో.. అనేక లోపాలున్నా అమ్మకానికి అనుమతిచ్చేశారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రమేయమే దీనికి ప్రధాన కారణం.

విశాఖ భూ అక్రమాల్లో భాగస్వాములైన మరో ఐఏఎస్​ సునీల్ శర్మ. 2001 అక్టోబరు నుంచి 2004 జులై వరకూ విశాఖ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో అసైనీల పేర్లు లేకున్నా, డీఆర్ ఫైల్స్ అందుబాటులో లేకపోయినా సరే వాటన్నింటినీ విస్మరించి మరీ రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చారు. ఆ తర్వాత ఆ భూమి అమ్మకానికి అనుమతిచ్చేశారు. ఈప్రక్రియంతా.. నెలలోనే ఆగమేఘాలపై పూర్తిచేసి.. భూమికొనుగోలుచేసిన లబ్దిదారులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని సిట్‌ గుర్తించింది. ఈ వ్యవహారంలో సునీల్ శర్మతోపాటు అప్పటి ఆర్డీవో డి. మార్కండేయులు, తహసీల్దార్​ విశ్వేశ్వరనాయుడుల.. పాత్ర అనుమానాస్పదమని సిట్‌ తెలిపింది. వీరిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

మాజీ సైనికోద్యోగుల కోటాలో మధురవాడలోని సర్వే నెంబర్ 355/11లో తనకు 5 ఎకరాలపై రుణం పొందేందుకు రెవెన్యూ రికార్డుల్లో పేరు చేర్పించాలని కనకారెడ్డి అనే వ్యక్తి విశాఖ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపైన కలెక్టర్‌ 2003 డిసెంబరు 31న ఆర్డీవో నివేదిక కోరారు. అసలు ఈ భూ కేటాయింపునకు సంబంధించి డీఆర్ ఫైల్స్ ఏవీ.. అందుబాటులో లేవు. కనీసం ఆక్రమణదారుగానైనా కనకారెడ్డి పేరు రెవెన్యూ రికార్డుల్లో లేదు. వాటన్నింటినీ విస్మరించి కలెక్టర్ సునీల్ శర్మ ఆదేశాల మేరకు.. కనకారెడ్డి పేరును అప్పటి తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఆ భూమిని.. సబ్ డివిజన్ కూడా చేసేశారు. కనకారెడ్డి కేవలం రెవెన్యూ రికార్డుల్లో తన 'పేరు' చేర్చాలని మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. అధికారులు దాన్ని అమ్ముకోవటానికీ అనుమతిచ్చేశారు. తహసీల్దార్ కార్యాలయం మొదలుకుని కలెక్టరేట్‌ వరకూ అత్యంత వేగంగా ఈ దస్త్రాన్ని నడిపించారని సిట్‌ తేల్చింది. మధురవాడ సర్వే నంబర్ 349/2/Aలో మూడెకరాలు, 348/1లో ఐదెకరాలు అమ్ముకునేందుకు సింహాచలం, బండారు వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్తులకూ ఇలాగే అడ్డగోలుగా అనమతులిచ్చారు. ఈ మూడు ఘటనల్లోనూ.. కేవలం డీ పట్టాలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులతోనే మొత్తం దస్త్రాలు నడిపించేశారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు లేవు. ఆ తర్వాత విశాఖ జాయింట్ కలెక్టర్ గా వచ్చిన పీయూష్ కుమార్ ఈ మూడు డీ పట్టాలతో పాటు మొత్తం.. 12 డీ పట్టాలు నకిలీవని గుర్తించి.. వాటి తదుపరి క్రయవిక్రయాలు నిలిపేస్తూ ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి భీమునిపట్నం పోలీసు స్టేషన్‌లో.. కేసు నమోదైంది. దర్యాప్తు సరిగ్గా చేయకుండానే కేసు మూసేయడంతో.. ఆ భూములు వేరేవాళ్ల చేతుల్లోకి మారాయి. ఈ కేసును.. మళ్లీ తిరిగి తెరవాలని సిట్ సిఫార్సు చేసింది. రిజిస్టర్లు అందుబాటులో లేకపోయినా.. తహసీల్దార్​లు సంతృప్తి చెందితే రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయొచ్చని అప్పటి కలెక్టర్‌ సునీల్‌ శర్మ.. సిట్‌కు వివరణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో విచారించి తహసీల్దారే​మార్పులు, చేర్పులు చేశారని తెలిపారు.

విశాఖ భూ కుంభకోణంలో మరో ఐఏఎస్​ కృష్ణబాబుపై.. సిట్‌ క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసింది. 2000 మే నుంచి 2003 జూన్ వరకూ విశాఖ జేసీగా పనిచేసిన కృ‌ష్ణబాబు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రెవెన్యూ రికార్డులో పేర్లు చేర్చాలంటూ మాజీ సైనికోద్యోగుల పేరిట దరఖాస్తులుఅందగా.. అందులోని పట్టాలు నిజమైనవేనా? కాదా? అనేది పరిశీలించాలని ఆదేశించలేదు. మాజీ సైనికోద్యోగుల పేరుతో భూ కేటాయింపునకు సంబంధించి డీఆర్ ఫైల్స్, అసైన్మెంట్ రిజిస్టర్ అందుబాటులో లేకపోయినా కృష్ణబాబు ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆడంగల్ కూడా పరిశీలించకుండా దరఖాస్తుదారుల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చెర్చేసి సబ్ డివిజన్ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు చేర్చటం కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుదారులకు అసలు తెలియకుండానే టైటిల్ మార్పునకు అనుమతిచ్చేశారని సిట్‌ తెలిపింది. ఈ వ్యవహారంలో కృష్ణబాబుతోపాటు అప్పటి ఆర్డీవో ఎర్రయ్య, అప్పటి విశాఖ గ్రామీణ మండల తహసీల్దార్ , ఇటీవలే ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష విభాగం ప్రత్యేకాధికారి బి. సుబ్బారావు పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ తేల్చింది. ప్రభుత్వ భూమి అమ్ముకునేందుకు వీలుగా.. ముగ్గురూ కుట్ర చేశారని.. ముగ్గురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

విశాఖకు చెందిన వాకాడ అప్పలరెడ్డి, కాకి అప్పలరెడ్డి, కండ్రాపు లక్ష్మణరావు మధురవాడలోని 130/7, 130/8, 130/9 సర్వే నెంబర్లలో ఐదెకరాల చొప్పున 15 ఎకరాలు, అచ్చిరామి రెడ్డికి 130/10 సర్వే నెంబర్లో 3 ఎకరాలను మాజీ సైనికోద్యోగుల కోటాలో 1982లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సదరు భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు చేర్చాలంటూ 2002 ఏప్రిల్ 20న విశాఖ కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. అప్పటి జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణబాబు ఆదేశాల మేరకు అదే ఏడాది జులై 15న విశాఖ గ్రామీణ తహసీల్దార్​ నలుగురి పేర్లనూ రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఆ తర్వాత మొత్తం 18 ఎకరాలను ఆ నలుగురు వేర్వేరు వ్యక్తులకు అమ్మేశారు. దాన్ని కొనుగోలు చేసిన సాంబశివరావు. అజయ్ రెడ్డి, కె.విజయాదేవి, వెంకట కృష్ణారెడ్డి, వేమూరి రమేష్, పెన్మత్స సత్య శ్రీనివాస్, బొల్లినేని జయప్రద అందులో లే అవుట్లు వేసుకునేందుకు వుడా నుంచి అనుమతి తెచ్చుకుని.. లేఔట్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. ఈ మొత్తం ప్రక్రియంతా.. నోటరీ చేసిన డీఫామ్ పట్టా జిరాక్స్ కాపీతోనే నడిచింది. అయితే.. గతంలో ప్రభుత్వాలు మాజీ సైనికోద్యోగులకు పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాయని, హడావుడిలో భూముల సబ్‌ డివిజన్‌ జరగకపోయి ఉండొచ్చన‌్న కృష్ణబాబు.. కేటాయింపు వాస్తవమైందని ఎమ్మార్వో సంతృప్తి చెందితే దరఖాస్తుదారుల పేర్లు ఎమ్మార్వోనే రికార్డుల్లో చేర్చవచ్చని సిట్‌కు వివరణ ఇచ్చారు.

అధికార పరిధిదాటి ఎన్​ఓసీలు జారీ చేసిన మరో ఐఎస్​ ఎం. వీరబ్రహ్మయ్య. ఈయన కూడా విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. దేశపాత్రునిపాలెంలోని కొన్ని అసైన్డ్ భూముల విక్రయానికి.. జేసీ హోదాలో వీరబ్రహ్మయ్య రెండు ఎన్​ఓసీలు ఇచ్చారు. ఈ భూములను.. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు రామదాస్‌, ఆయన సన్నిహితుల కంపెనీలు కొనుగోలు చేశాయి. ఈ వ్యవహారమంతా కుట్ర ప్రకారమే జరిగిందని సిట్ తేల్చింది. నిబంధనల ప్రకారం ఎన్​ఓసీ జారీ చేసే అధికారం జాయింట్ కలెక్టర్‌కు లేదు. అయినా ఎన్​ఓసీలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసింది.

ఇవీచదవండి:

మాజీ సైనికోద్యోగుల పేరిట భూములు కాజేసిన ఐఏఎస్​లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.