రాష్ట్రంలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు

author img

By

Published : Nov 25, 2022, 6:53 AM IST

Updated : Nov 25, 2022, 8:37 AM IST

Harassment of YCP leaders

Harassment of YCP Laders: రాష్ట్రంలో వై​సీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అడ్డుగా ఉన్నవారిని అంతం చేయడం, ఎదురుతిరిగిన వారిపై కక్ష సాధించడమే పని అన్నట్లు.. వై​సీపీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. సామాన్య జనం భరించలేనంతగా అకృత్యాలు పెరిగిపోయాయి. వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు బలవన్మరణాలకు యత్నించారు. దళితులు, గిరిజనులు, సామాన్యుల భూములను కబ్జా చేస్తున్న ఘటనలకు కొదువ లేదు. చివరికి శ్మశాన వాటికలనూ వదలట్లేదు.

రాష్ట్రంలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు

Harassment of YCP Laders: శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వై​సీపీ నాయకుల ఆగడాలే కనిపిస్తున్నాయి. వారి పదఘట్టనల్లో నలిగిన బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా హద్దే లేదన్నట్లు వై​సీపీ నాయకుల అరాచకాలు సాగుతున్నాయి. వాటిలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 21 మధ్య 113 రోజుల వ్యవధిలో జరిగిన ఘటనల్లో కొన్నింటిని 'ఈనాడు-ఈటీవీ' పరిశీలించాయి. బాధితుల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలే అధికంగా ఉన్నారు. వై​సీపీ నాయకుల అరాచకాలపై కొన్నిచోట్ల కనీసం కేసులు కూడా నమోదు కాలేదు. మరికొన్ని ఘటనల్లో కేసు నమోదైనా అరెస్టు చేయలేదు. ఇంకొన్నింటిలో కీలక నిందితుల్ని కేసు నుంచి తప్పించారు.

మొత్తం 47 ఘటనలను పరిశీలించగా... అందులో ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు బాధితులుగా ఉన్న ఘటనలు 30 ఉన్నాయి. అంటే 63.83 శాతమన్నమాట. బాధితుల్లో ఎస్సీలు 11 మంది ఉండగా, ఎస్టీలు ఇద్దరు, బీసీలు 16 మంది, మైనారిటీలు ఒకరు ఉన్నారు. మరో 10 ఘటనల్లో ఇతరవర్గాల వారు బాధితులని తేలింది. ఇవి కాకుండా విపక్ష పార్టీల కార్యాలయాలు, అన్నక్యాంటీన్లపై దాడులు, కూల్చివేతలు ఉన్నాయి. వై​సీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నవారు ఆరుగురు ఉండగా... వీరిలో ఇద్దరు దళితులు, ముగ్గురు బీసీలు, ఒకరు ఇతర వర్గాల వారిగా నిర్ధరణ అయింది. ఆత్మహత్యాయత్నం చేసిన ఐదుగురిలో ముగ్గురు బీసీలు, ఒకరు ఎస్టీ, ఇంకొకరు ఇతరులు ఉన్నారు. వై​సీపీ నాయకులు, అధికారులు కలిసి దౌర్జన్యం చేయడం వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎస్సీ వ్యక్తి దుగ్గిరాల కరుణాకర్‌... వై​సీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. 20 లక్షలు అప్పుచేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోనివ్వకుండా వై​సీపీ సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ జిల్లా ఎస్పీకి... కరుణాకర్‌ లేఖ రాశారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని లేఖలో వాపోయారు. ఈ కేసులో కొన్ని రోజులు రిమాండ్‌లో ఉన్న నిందితులు.. బెయిలుపై బయటకొచ్చారు. జగదీశ్వర్‌రెడ్డి శ్రీశైలం బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు.

వై​సీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్, ఎస్సై కిరణ్‌ కుమార్‌ బెదిరింపులు భరించలేకపోతున్నానంటూ లేఖ రాసి.. ఎస్సీ వర్గానికి చెందిన ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. నాగేశ్వరరావు వద్ద పనిచేసే సురేష్‌.. పక్షులను బెదరగొట్టేందుకు నాటు తుపాకీ పేలుస్తూ గాయపడ్డారు. అతనికి 10 లక్షలు చెల్లించాలని సత్యనారాయణ, గంగాధర్‌ బెదిరించారు. అంత ఇవ్వలేననటంతో అదే రోజు రాత్రి నాగేశ్వరరావును పోలీసు స్టేషన్‌కు పిలిచిన ఎస్సై కిరణ్‌కుమార్‌... బెదిరించడంతోపాటు కొట్టారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సత్యనారాయణ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సత్యనారాయణ లొంగిపోయారు. ఎస్సై కిరణ్‌కుమార్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలవగా... మిగతావారు రిమాండ్‌లో ఉన్నారు. తన భర్త చావుకు కారణమైన ఎస్సైకి నెల రోజుల్లోపే బెయిలు ఇచ్చేశారని.. మిగతా నిందితులూ బయటకొచ్చేస్తామని చెబుతున్నారంటూ నాగేశ్వరరావు భార్య సౌదామిని వాపోయారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురానికి చెందిన కడియాల అచ్చియమ్మకు... ఆమె సోదరులు సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు రెండు సెంట్ల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ భూమిపై వై​సీపీ నాయకులతో వివాదం ఉంది. వారి వేధింపులతో సెప్టెంబర్ 9న సోమేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా వై​సీపీ నాయకుల వేధింపులు ఆగలేదు. ఆ స్థలాన్ని ఉడా లేఅవుట్‌లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లోగా ఖాళీ చేయాలంటూ... నవంబరు 2న అధికారులతో నోటీసులు ఇప్పించారు. కలత చెందిన అచ్చియమ్మ... వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమేశ్వరరావు ఆత్మహత్యకు వై​సీపీ నాయకులే కారణమని ఫిర్యాదు చేసినా అప్పట్లో కేసు నమోదు చేయలేదు. అచ్చియమ్మ బలవన్మరణానికి పాల్పడిన తర్వాత కూడా... బాధ్యులైన వై​సీపీ నాయకుల్ని నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారే తప్ప ఒక్కరినీ అరెస్టు చేయలేదు.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాళ్యానికి చెందిన 12 మందికి... ఒక్కొక్కరికీ రెండేసి సెంట్ల చొప్పున 2013లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లోవారు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే... వై​సీపీ నాయకుల ప్రోద్బలంతో ఆ స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌ భవనాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. వెంటనే స్థలాలు ఖాళీచేసి వెళ్లిపోవాలని పేదలపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై బాధితులు అక్టోబర్ 21న హైకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 11న విచారణ జరుగుతుందనగా... 5వ తేదీ రాత్రి పేదల గుడిసెలను వై​సీపీ నాయకులు తొలగించారు. తెల్లారేసరికి పొక్లెయిన్‌తో పునాదులు తవ్వడంతో... బాధితుల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ఫిర్యాదుచేసినా కేసు పెట్టలేదు.

పులివెందుల నియోజకవర్గ పరిధి దిద్దేకుంటకు చెందిన తెలుగుదేశం నాయకుడు పెద్దసోమప్పగారి పరమేశ్వరరెడ్డి హత్యకు గురయ్యారు. వైకాపా నాయకులే కారణమని బాధిత కుటుంబీకులు ఫిర్యాదుచేశారు. అయితే... కీలక నిందితులు హరినాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేదని, ఇతరులను నిందితులుగా చేర్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఎస్సీ వ్యక్తి అంజి బర్నబాస్‌ను కొందరు అపహరించి హత్య చేశారు. వై​సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య అనుచరులు, వై​సీపీ నాయకులు నన్నపనేని వీరయ్యచౌదరి, కొఠారు వెంకటరమణ ప్రమేయంతోనే బర్నబాసు హత్యకు గురయ్యారని... ఆయన భార్య నందిని ఆరోపించారు. అయితే ఈ ఘటనలో వారి ప్రమేయంపై ఆధారాల్లేవని పోలీసులు పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని మల్లికార్జున నగర్, బాలిరెడ్డి నగర్‌ ప్రాంత గిరిజనులకు... శ్మశానవాటిక కోసం సర్వేనంబర్ 105లో 4.30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. వై​సీపీ నాయకుడు చాన్‌బాషా నకిలీ పట్టాతో ఆ భూములను ఆక్రమించారు. అంత్యక్రియల కోసం వెళ్లిన గిరిజనులపై మారణాయుధాలతో దాడి చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినా, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే చాన్‌బాషాను పోలీసులు అరెస్టు చేయట్లేదని గిరిజనులు వాపోతున్నారు.

2022 ఆగస్టు 21న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండలో కుళాయికి మంచినీరు రాలేదని ప్రశ్నించిన ఎస్సీ వ్యక్తి చిన్నయన్నప్ప కుటుంబంపై అదే రోజు వై​సీపీ నాయకులు దాడి చేశారు. 2022 ఆగస్టు 22 అనంతపురం జిల్లా గుత్తిలో ఎస్సీ వర్గానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌పై.. వై​సీపీ నాయకుడు ఉమర్, ఆయన కుమారుడు మైను కలిసి దాడి చేసి దుర్భాషలాడారు. 2022 నవంబరు ‍18న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పాతచెదుళ్లలో.. ఎస్సీ వ్యక్తి రమేష్‌ కుటుంబంపై వై​సీపీ నాయకుడు, సర్పంచి శ్రీనివాసులురెడ్డి వీరంగం సృష్టించారు. 20 ఏళ్లుగా రమేష్‌ కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలం వద్ద జేసీబీతో అలజడి సృష్టించారు.

Last Updated :Nov 25, 2022, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.