ETV Bharat / state

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు.. ఎంపీ సోదరుడిని విచారించనున్న ఈడీ..!

author img

By

Published : Dec 8, 2022, 9:27 AM IST

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు..
దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు..

Delhi Liquor Scam Case Update : దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన శరత్​ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్.. రాబోయే రోజుల్లో మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఓ ఎంపీ సోదరుడూ ఉన్నట్లు సమాచారం. మద్యం ముడుపుల కేసులో లబ్ధి చేకూర్చుతానని నిందితులు, అనుమానితులతో బేరమాడారన్న అనుమానంతోనే ఆయనను విచారించాలని దిల్లీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Delhi Liquor Scam Case Update : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో అనేకమార్లు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా గోరంట్ల అసోసియేట్స్​లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా అనేక మందిని దిల్లీ పిలిపించి విచారించారు. దిల్లీ మద్యం వ్యాపారంలో దక్షిణాది లాబీ కీలకపాత్ర పోషించిందని, పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది సర్కిళ్లను ఇదే లాబీ దక్కించుకుందని దర్యాప్తులో వెల్లడైంది.

ఆ ఇద్దరు ఒకరేనా..? వేర్వేరా?.. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్న అరబిందో ఫార్మాకు చెందిన శరత్​చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. ఈలోపు సీబీఐ అధికారులు రాష్ట్రానికి చెందిన తెరాస ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న ఆమెను విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు వేగం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ ఎంపీ సోదరుడిని విచారణకు పిలవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ ఎంపీ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినప్పుడు పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ దొరికిందని.. దీని వివరాలు తెలుసుకునేందుకు ఇటీవల ఈడీ అధికారులు ఆయన సోదరుడిని పిలిపించి విచారించారని సమాచారం. ప్రస్తుతం మద్యం ముడుపుల కేసులో దిల్లీ ఈడీ అధికారులు విచారణకు పిలిచిన ఎంపీ సోదరుడు, విదేశీ కరెన్సీ విషయంలో విచారణకు హాజరైన వ్యక్తి ఒకరేనా..? వేర్వేరా? అనేది త్వరలోనే తేలనుంది.

మరో వారం రోజుల కస్టడీ..: దిల్లీ మద్యం కేసులో అమిత్ అరోడా ఈడీ కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరో వారం పొడిగించింది. పీఎంఎల్ఏ కింద అరోడాను అరెస్టు చేసిన ఈడీ.. గతవారం రౌస్ అవెన్యూలోని సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరచగా.. 7 రోజుల కస్టడీకి ఇచ్చింది. గడువు ముగియడంతో బుధవారం ఈడీ అధికారులు న్యాయస్థానం ఎదుట మరోసారి అరోడాను హాజరుపర్చారు. కీలక సమచారం సేకరిస్తున్నందున కస్టడీని మరో 10 రోజులు పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. స్పందించిన న్యాయస్థానం కస్టడీని వారం రోజులు పొడిగించింది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.