ETV Bharat / state

CM Jagan Visakha Tour: సీఎం జగన్​ విశాఖ పర్యటన.. షెడ్యూల్​ ఇదే

author img

By

Published : Nov 10, 2022, 3:36 PM IST

CM Jagan
సీఎం జగన్​ విశాఖ పర్యటన

CM Jagan Visakha Tour: రేపు, ఎల్లుండి విశాఖలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ప్రధాని విశాఖకు రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి సీఎం జగన్​.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్​ను అధికారులు వెల్లడించారు.

CM Jagan Visakha tour: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్​.. 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.

ఎల్లుండి ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Modi Tour In Visakha: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 11వ తేదీన మధురై నుంచి నేరుగా విశాఖపట్నంకు సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళం చేరుకుని చోళ సూట్‌లో బస చేస్తారు. మరుసటి రోజైన శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10 వేల 472 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

విశాఖ మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, విస్తరణ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాయపూర్-విశాఖల మధ్య 3 వేల 778 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్‌, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ 566 కోట్లతో నిర్మించనున్న డెడికేటెడ్ పోర్టు రోడ్డు నిర్మాణానికి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 460 కోట్లతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నిర్మాణాలకు భూమి పూజ చేస్తారు. శ్రీకాకుళం నుంచి ఒడిశా ఆంగుల్ పట్టణం వరకూ గ్యాస్ అథారిటీ 2 వేల 658 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సహజవాయు సరఫరా పైపు లైన్‌ శంకుస్థాపన‌ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

211 కోట్ల రూపాయలతో పాతపట్నం- నరసన్నపేటలను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే 2 వేల 917 కోట్లతో ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్లో అభివృద్ధి చేసిన యూ-ఫీల్డ్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వర్చువల్ విధానంలోనే ప్రధాని వీటన్నింటికి పచ్చజెండా చూపుతారని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.