ETV Bharat / state

సెల్​ఫోన్ పోయిందని... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

author img

By

Published : Aug 28, 2020, 10:53 PM IST

Updated : Aug 29, 2020, 6:14 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్‌లో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారు. ఈ విషయమై సినీ నిర్మాత నూతన్‌నాయుడిపై బాధితుడు ఫిర్యాదు చేశారు. నూతన్‌నాయుడు ఇంట్లోనే తనకు శిరోముండనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

atrocities-in-visakhapatnam-dot-dot-dot-beheading-of-sc-youth-dot
సెల్​ఫోన్ పోయిందని... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన ఓ దళిత యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ యువకుడు (20)కు నాన్నమ్మ, చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ తరలివచ్చాడు. సుజాతనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత, బిగ్‌బాస్‌-2 ఫేమ్‌ ఎన్‌.నూతన్‌నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి రప్పించారు. సెల్‌ఫోన్‌ విషయమై నిలదీయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి అతను‌ వెళ్లిపోయాడు.

శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తమ సూపర్‌వైజర్‌ ద్వారా ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు. నూతన్‌నాయుడి భార్య, ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది అతణ్ని గట్టిగా నిలదీశారు. సెల్‌ఫోన్‌ దొంగిలించినట్లు అంగీకరించకుండా ఎదిరించాడన్న కోపంతో క్షురకుడిని పిలిపించి యువకుడికి గుండు కొట్టించారు. అంతేగాకుండా రాడ్‌తో దాడి చేసి గాయపరిచారు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపేశారు. బాధితుడు‌ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాడు. పెందుర్తి పోలీసులు అతణ్ని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. నార్త్‌ జోన్‌ ఇంఛార్జి ఏసీపీ శ్రావణ్‌కుమార్‌ బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు.

అతనే గుండు కొట్టించుకున్నాడు: నూతన్​నాయుడు

"మా ఇంట్లో ఆ యువకుడితోపాటు మరో యువతి పనిచేస్తోంది. ఆమె సెల్‌ఫోన్‌లోని చిత్రాలను ఆ యువకుడు‌ తీసుకోవడంతోపాటు స్నేహితులకు పంపి వేధిస్తున్నాడు. యువతి ఈ విషయాన్ని మాకు చెప్పింది. దీనిపై ప్రశ్నించడానికి ఇంటికి పిలిపించాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే.. వద్దని బతిమాలాడు. చేసిన తప్పునకు శిక్షగా తనకు గుండు కొట్టించాలని చెప్పి, క్షురకులను ఇంటికి తీసుకొచ్చి గుండు కొట్టించుకున్నాడు." అని ఈ ఘటనపై నూతన్ నాయుడు స్పందించారు.

ఇదీ చదవండి:

సీతానగరం ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

Last Updated :Aug 29, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.