ప్రారంభంకానున్న బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు.. నేడు పెద్దశేషవాహన సేవ

author img

By

Published : Sep 27, 2022, 6:48 AM IST

TIRUMALA BRAHMOTSAVAM 2022

BRAHMOTSAVAM 2022 : ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో.. నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి.. పెద శేషవాహన సేవలో పాల్గొంటారు. కరోనాతో రెండేళ్లు ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించిన తితిదే.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో ఘనంగా చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

TIRUMALA BRAHMOTSAVAM 2022 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య.. ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం.. విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహన కార్యక్రమంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.

విద్యుత్​ కాంతులతో వెలుగులీనుతున్న తిరుమల కొండ : కరోనా నేపథ్యంలో.. రెండేళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన తితిదే.. ఈ ఏడాది వేడుకల్ని భక్తుల మధ్య జరపనుంది. భక్తులు అధికంగా వస్తారనే అంచనాతో ఘనంగా ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయం సహా.. స్వామివారి సన్నిధి, పడికావలి, రంగనాయకుల మండపాన్నివిద్యుత్‌ దీపాలు, పుష్పాలతో.. అలంకరించారు. తిరుమల కొండ ప్రధాన కూడళ్లు, రహదారులు.. బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నాయి. వేడుకలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం : స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి.. సీఎం చేరుకుంటారు. గంగమ్మ ఆలయాన్ని సందర్శించి, సారె సమర్పించిన అనంతరం.. అలిపిరిలో ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ బస్సులు ప్రారంభిస్తారు. ఆ తరువాత తిరుమల వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి..పెదశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి.. బుధవారం ఉదయం పరకామణి నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం లక్ష్మీ వీపీఆర్‌ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి.. అక్కడి నుంచి సీఎం నంద్యాల జిల్లా బయలుదేరి వెళ్లతారు.

పెద్దశేషవాహనం (ఈరోజు రాత్రి 9 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అయిన ఈరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం.

చిన్నశేషవాహనం (28వ తేదీ ఉదయం 8 గంటలకు): రెండో రోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది.

హంస వాహనం (28వ తేదీ రాత్రి 7 గంటలకు): బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.

సింహ వాహనం (29వ తేదీ ఉదయం 8 గంటలకు): శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

ముత్యపుపందిరి వాహనం (29న రాత్రి 7 గంటలకు): జ్యోతిష్యశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

కల్పవృక్ష వాహనం (30వ తేదీ ఉదయం 8 గంటలకు): క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.

సర్వభూపాల వాహనం (30వ తేదీ రాత్రి 7 గంటలకు): సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

మోహినీ అవతారం (అక్టోబర్‌ ఒకటో తేదీ ఉదయం): బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

గరుడ వాహనం (1వ తేదీ రాత్రి 7 గంటలకు): 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం (2వ తేదీ ఉదయం 8 గంటలకు): శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

స్వర్ణరథం (2వ తేదీ సాయంత్రం 4 గంటలకు): స్వర్ణరథం స్వామికి ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారక ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకూ అలాంటి సంతోషమే కలుగుతుంది.

గజవాహనం (2వ తేదీ రాత్రి 7 గంటలకు): శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.

సూర్యప్రభ వాహనం (3వ తేదీ ఉదయం 8 గంటలకు): సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి.

చంద్రప్రభ వాహనం (3వ తేదీ రాత్రి 7 గంటలకు): చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

శ్రీవారి రథోత్సవం (4వ తేదీ ఉదయం 7 గంటలకు): ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

అశ్వవాహనం (4వ తేదీ రాత్రి 7 గంటలకు): ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. వాటిని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కష్ణయజుర్వేదం తెలుపుతోంది. ఈ వాహనంపై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.

చక్రస్నానం (5వ తేదీ ఉదయం 6 గంటలకు): చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.

ధ్వజావరోహణం (5వ తేదీ రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.