ETV Bharat / state

Dumping Yard ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు.. కాలుష్య కేంద్రంగా మారుతోందా?

author img

By

Published : Apr 25, 2023, 3:20 PM IST

Dumping Yard:అది ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు. అధికారుల వైఫల్యం కారణంగా ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం.. ప్రస్తుతం కాలుష్య కేంద్రంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నది ఒడ్డున వ్యర్థాలను డంపింగ్ చేస్తుండటం, దానిని తగలబెడుతుండటంతో.. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

Dumping Yard
డంపింగ్ యార్డ్

Dumping Yard Pollution Problems: వ్యర్థాల నుంచి సంపద సంగతి ఎలా ఉన్నా.. వాటి నిర్వహణలో అధికారుల వైఫల్యం కారణంగా.. ప్రశాంత వాతావరణంతో నిండిన కాలనీలు కాలుష్య కేంద్రాలుగా మారుస్తున్నాయి. వ్యర్థాలను క్రమపద్దతిలో నిర్వహించాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తగలబెట్టేస్తుండటంతో డంపింగ్‌ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

సేకరించిన చెత్తను నిల్వచేయడానికి అవసరమైన ప్రాంతాన్ని గుర్తించడంలో విఫలమైన అధికారులు స్వర్ణముఖి నదినే డంపింగ్‌ యార్డుగా మార్చేయడంతో కాలుష్య తీవ్రత పెరిగిపోయింది. తిరుపరి జిల్లాలోని శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో స్వర్ణముఖి నది.. డంపింగ్‌ యార్డుగా మారిన తీరు.. చెత్తను తగులపెడుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు శివారులో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది గ్రామ పంచాయతీ అధికారుల నిర్వాకంతో కాలుష్య కాసారంగా మారింది. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో వెలువడుతున్న వ్యర్థాలను స్వర్ణముఖి నది తీరంతో పాటు నదీగర్భంలో వేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 35 వేల జనాభా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీ తిరుచానూరు పరిధిలో దాదాపు రోజుకు రెండు టన్నుల మేర వ్యర్థాలు పోగవుతున్నాయి.

వ్యర్థాల నిర్వహణలో గ్రామ పంచాయతీ అధికారుల వైఫల్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామంలో సేకరిస్తున్న వ్యర్థాలను గ్రామశివారులో ఉన్న స్వర్ణముఖి నది ఒడ్డున వేస్తున్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు పోగుపడిన చెత్తకు నిప్పుపెడుతున్నారు. పోగుపడిన చెత్తను అధికారులు తగులపెడుతుండటంతో పరిసర కాలనీలు దట్టమైన పొగతో నిండిపోతున్నాయి.

క్రమ పద్దతిలో వ్యర్థాలను నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు సేకరించిన చెత్తను తగులపెట్టేసి చేతులు దులిపేసుకొంటున్నారు. దీంతో పరిసర ప్రాంత కాలనీవాసులు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. స్వర్ణముఖి నది తీరాన్ని అనధికార డంపింగ్‌ యార్డుగా మార్చిన అధికారులు.. వ్యర్థాలను కాల్చివేస్తుండటంతో వాయుకాలుష్యం అధికమైందని స్థానికులు వాపోతున్నారు. చెత్తను తగులపెడుతున్న సమయంలో వెలువడుతున్న పొగతో వృద్దులు, చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నివాస ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడం ఇబ్బందిగా ఉందని.. వర్షం వచ్చిందంటే దుర్వాసనతో తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో డంపింగ్‌ యార్డుతో వాయు, జల కాలుష్యం ఏర్పడుతోందన్నారు. స్వర్ణముఖ నదీ పరీవాహక ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉండేదని అంటున్నారు.

తిరుపతి నగర శివారులో ఉంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుచానూరు గ్రామ పంచాయతీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను నిల్వ చేయడానికి డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడంలో అధికారులు దృష్టి సారించడం లేదు. తాత్కాలిక పరిష్కారంగా స్వర్ణముఖి నదిలో వేసి తగులపెడుతున్న అధికారులు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు నదిని కాలుష్య కారకం చేస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం కొలువైన తిరుచానూరు.. కాలుష్య కేంద్రంగా మారుతోందా?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.