ETV Bharat / state

జగన్‌ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు: చంద్రబాబు

author img

By

Published : May 4, 2022, 10:10 PM IST

Updated : May 4, 2022, 11:03 PM IST

కరోనా కంటే ముఖ్యమంత్రి జగన్ ప్రమాదకరమైన వ్యక్తి అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారని.., జగన్ వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవ్వటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదని ఆక్షేపించారు.

జగన్‌ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు
జగన్‌ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు

జగన్‌ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వారంలో 5 ఘటనలు, నెలలో 30 సంఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. జగన్‌ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని.., 151 సీట్లు రావటంతో జగన్‌కు అహంకారం పెరిగిందని ఆక్షేపించారు.

కరోనా కంటే సీఎం జగన్ ప్రమాదకరమైన వ్యక్తి అని చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. సరైన విద్యుత్ సరఫరా ఉండదు కానీ.. బిల్లు మాత్రం బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ రూ.140కే ఇస్తే.. ఇప్పుడు రూ.290కి పెంచారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసే అదృష్టం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. జగన్‌లా తాను దోచుకోలేదు, దాచుకోలేదన్నారు. జగన్ వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవ్వడం ఖాయమని అన్నారు.

"ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ పనులైనా చేయలేదు. మా ప్రభుత్వ హయంలో ప్రైవేటు రంగంలో 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించాం. రైతుల మోటార్లకు జగన్‌ మీటర్లు పెడతానంటున్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ పోతుంది. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు అమ్ముకుంటున్నారు. రేపల్లెలో గర్భిణిపై హత్యాచారం ఘటన బాధాకరం. వారంలో 5 ఘటనలు, నెలలో 30 సంఘటనలు జరిగాయి. నా ఇంటిపై దాడి చేశారు, అసెంబ్లీలో నన్ను అవమానించారు. నా కుటుంబ సభ్యులనూ అవమానపరిచారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

రాష్ట్రం డ్రగ్స్‌కు చిరునామాగా మారిపోయిందని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్ రెడ్డి హయాంలో ఇతర దేశంలో డ్రగ్స్ అమ్మే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటుసారా వినియోగం పెరిగిందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం చంద్రబాబు.. విశాఖకు బయల్దేరి వెళ్లారు.

ఇదీ చదవండి: పది పరీక్షల్లో పేపర్ లీక్ జరగలేదు.. కానీ 60 మందిపై కేసులు : మంత్రి బొత్స

Last Updated :May 4, 2022, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.