ETV Bharat / state

భీష్మ ఏకాదశి వేడుకల్లో ఆకట్టుకున్న అరటి గెలల పందిరి

author img

By

Published : Feb 23, 2021, 6:05 PM IST

Updated : Feb 23, 2021, 7:29 PM IST

Bhishma Ekadasi celebrations at Chetlatandra
భీష్మ ఏకాదశి వేడుకల్లో ఆకట్టుకున్న అరటి గెలల పందిరి

భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా చెట్లతాండ్ర గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కట్టిన వేల ఆరటి గెలలు ఆకర్షణీయంగా నిలిచాయి.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర గ్రామంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినం సందర్భంగా గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం వద్ద వేలాది ఆరటి గెలలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 5వేలకు పైగా అరటి గెలలు కట్టడం ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భారీగా పందిరి వేసి అరటి గెలలు వేలాడ దీసి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు చేశారు. తమ కోరికలు నెరవేరుతున్నందున స్వామిని దర్శించుకుని అరటి గెల కడుతున్నట్లు పలువురు భక్తులు తెలిపారు.

భీష్మ ఏకాదశి వేడుకల్లో ఆకట్టుకున్న అరటి గెలల పందిరి

250 ఏళ్ల క్రితం..

250 ఏళ్ల క్రితం పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ గ్రామానికి వచ్చి కొంతకాలం తర్వాత అక్కడే సజీవ సమాధి పొందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఎంతో మహిమగల ఆయన లక్ష్మీ నృసింహస్వామి ఉపాసకులు కావడంతో ఆయన సమాధిపై లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని నిర్మించి తరాలుగా పూజలు చేస్తున్నారు. సమాధిపై పుట్టిన మర్రిచెట్టు మొదలును ఆయన ప్రతిరూపంగా భావించి పూజిస్తున్నారు. ఆలయం వద్ద అరటి గెల కడితే తమ కోర్కెలు నెరవేరతాయన్నది భక్తుల విశ్వాసం.

ఇదీ చదవండి: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, వ్రతాలు

Last Updated :Feb 23, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.