ETV Bharat / state

పోలీసుల కళ్లుగప్పి రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా

author img

By

Published : Sep 2, 2020, 10:26 PM IST

రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కేటుగాళ్లు మద్యాన్ని పోలీసుల కళ్లుగప్పి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నారు. అంతేకాదు గుట్కా ప్యాకెట్లను ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. విజయనగరం , శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Alcohol smuggling
Alcohol smuggling

విజయనగరం జిల్లా మక్కువ మండలంలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మూడు వేల లీటర్ల నాటుసారాను గుర్తించారు. దీనితో పాటు 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీని ధర సుమారు 45వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రాజపురం జంక్షన్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 261 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు. ఈ మద్యం అంతా ఒడిశా రాష్ట్రం రాయఘడ ప్రాంతంలో కొనుగోలు చేసినట్టు తెలిపారు. విక్రయాలు చేసిన వారిపైన సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. వీటి విలువ సుమారు 70వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పాతపట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాను చెక్ పోస్ట్ తనిఖీ సిబ్బంది పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన యువకులు కారులో ఖైనీ ప్యాకెట్లను తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యువకులను, ఖైనీ ప్యాకెట్లను పాతపట్నం పోలీస్ స్టేషన్​లో అప్పగించారు.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరులో మద్యం కొనుగోలు చేసి.. నెల్లూరు జిల్లా శివారు గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పామూరు ఎస్సై చంద్రశేఖర్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 47 మద్యం సీసాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్ మండలంలో ఉల్లిగడ్డల మధ్య గుట్కా అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వీటిని పట్టుకున్నారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా.. వాహనంలో ఉన్న మొత్తం ఉల్లిగడ్డలు పాడైపోయి ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు వాహనాన్ని మొత్తం పరిశీలించారు. మొత్తం లోడ్ కిందకు దించగా ఉల్లి మాటున నడుస్తున్న నయా గుట్కా దందా బండారం బట్టబయలైంది. రూ.5 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.