ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయం...యువ రైతులకు ఫల'సాయం'

author img

By

Published : Nov 1, 2020, 6:53 PM IST

ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయం

ఎంత చదవినా మూలాలు మరిచిపోకూడదనేది వారి ఆలోచన. అదే మనకు జీవనం అవుతుందనుకున్నారా యువకులు ! ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలోనే ప్రతిభ కనిపిస్తుంది. అనుకున్నదొక్కటి.. జరిగిందొక్కటి అని కుమిలిపోకుండా..,ఉన్న అవకాశాలను వినియోగించుకుంటే ఫలితాలు సాధించవచ్చునని ప్రకాశం జిల్లా యువరైతులు నిరూపిస్తున్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో కొంతమంది యువకులు సాగుమీద దృష్టిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చేసే పనే అదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీరంతా నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు.., చదువుకుంటున్నవారు కావడం విశేషం. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వీరి పరిస్థితి తలకిందులయ్యింది. ఉద్యోగాలు కోల్పోయినవారు కొందరయితే.., కళాశాలలు తెరవకపోవడంతో ఖాళీగా ఉన్నవారు మరికొందరు. వీరందరూ సాగు మీద దృష్టి పెట్టారు. అందరూ చేసేలా కాకుండా పెట్టుబడి లేకుండా చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యం. రసాయనాలు వినియోగించడం వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశ్యంతో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిపెట్టారు.

గ్రామానికి చెందిన నూతక్కి వెంకటేశ్ బీఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్​డౌన్‌తో ఉద్యోగాన్ని వదిలి ఇంటికి రావాల్సి వచ్చింది. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జరిగే నష్టం వెంకటేశ్​ను ఆలోచనలో పడేసింది. లాక్​డౌన్ సమయంలో ఎలాంటి రసాయనక ఎరువులు వినియోగించుకుండా సాగుచేయాలని భావించాడు. తన మిత్రులు బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతున్న నర్రా బ్రహ్మసాయి, బీబీఏ చదువుతున్న సందీప్‌లతో తన ఆలోచనలు పంచుకున్నాడు. తనకు సొంత పొలం లేకపోయినా.., తన మిత్రుడు పొలంలో అర ఎకరా స్థలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ప్రారంభించాడు.గోమూత్రం, జీవామృతం వంటివి మాత్రమే వినియోగించి సాగు చేయటం మెుదలు పెట్టారు. చిన్న చిన్న మడులుగా విడగొట్టి తోటకూర, పాలకూర, చుక్క కూర వంటి ఆరు రకాల ఆకుకూరలు సాగు చేయగా మంచి దిగుబడి వచ్చింది.

వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది యువకులు ప్రకృతి సాగు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు లేకపోవటం వల్ల కాళీగా ఉండేకన్నా వ్యవసాయంతో ఎంతో కొంత ఆదాయ సమకూర్చుకోవడం ఉత్తమమని భావించి ఈ ప్రకృతి సాగుమీద దృష్టిపెట్టామని అంటున్నారు.ఇప్పుడొస్తున్న ఫలితాల అనుభవాలతో భవిషత్తులో సాగు విస్తీర్ణం పెంచి, నాణ్యమైన, రసాయన రహిత పంటలను ప్రజలకు అందిచటంతో పాటు ఉపాధి పొందుతామని యువకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి

'ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.