పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణలు.. పలుచోట్ల ఎన్నికలు వాయిదా

author img

By

Published : Sep 22, 2021, 11:35 AM IST

Updated : Sep 22, 2021, 8:55 PM IST

పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణలు

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు రాజకీయ పంచాయతీలకు తెర తీశాయి. పాఠశాలలపై పట్టు కోసం రాజకీయ నాయకులు కొట్లాటకు (fighting between ycp, tdp) దిగుతున్నారు. కొన్ని జిల్లాల్లో వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వారు ఓటు వేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను సైతం అడ్డుకుంటున్నారు. ఘర్షణల కారణంగా అధికారులు.. కొన్నిచోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని వైకాపా శ్రేణులు డిమాండ్‌ చేశాయి. తెదేపా శ్రేణులు మాత్రం ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టాయి. అధికార పార్టీ నాయకులు ఓ అడుగు ముందుకేసి ఓట్ల కోసం వెళుతున్న తల్లిదండ్రులను అడ్డుకున్నారు. అడ్డు తొలగాలంటూ గ్రామస్థులతో కలిసి తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

కడప జిల్లాలో ..
రామాపురం మండలం గువ్వలచెరువులో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ తలెత్తింది. వైకాపాలో రెండు వర్గాల మధ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు పోటాపోటీ నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

ఒక్క ఓటు విషయంలో వాగ్వాదం..

జిల్లాలోని పెద్దచెప్పలిలోని పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఒక్క ఓటు విషయంలో వైకాపా, తెదేపా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లాలో పలుచోట్ల పాఠశాల కమిటీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారీ తీశాయి. దయ్యాలకుంటపల్లిలో కమిటీ ఛైర్మన్‌గా తెదేపా నాయకుడు ఎంపిక కాగా.. వైకాపా సర్పంచ్ తెదేపా నాయకుడి ఎన్నిక పత్రాన్ని చింపివేశాడు.దాంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు శింగనమల మండలం జాలాలపురం, బుక్కరాయసముద్ర మండలం చెన్నంపల్లిలో పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఘర్షణలు జరగగా.. ఎన్నికలను వాయిదా వేశారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లిలో ఘర్షణ జరిగింది. పాఠశాల కమిటీ ఎన్నిక ఈ వివాదానికి దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. జరుగుపల్లిలో వైకాపా సర్పంచ్‌, తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయుల చొరవతో గొడవ సర్ధమణిగింది.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లాలోని మధురవాడ‌లో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో వివాదం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్దులున్న మధురవాడ పాఠశాలలో విద్యా కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో ప్రధానోపాధ్యాయుడు రాజబాబు ఎన్నికలను వాయిదా వేశారు.

శ్రీకాకుళం జిల్లాలో

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో వివాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఎన్నికలు నిర్వహించేందుకు పాఠశాల సిబ్బంది సిద్ధమయ్యారు. ఓ వర్గం రహస్య ఓటింగ్ కావాలంటూ పట్టుబట్టారు. నిబంధన ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివాజీ వారికి చెప్పారు. తెదేపా వర్గీయులు ఎన్నికలను బహిష్కరించారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి ఆదర్శ పాఠశాల్లో పాఠశాల కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల వారు పోటీ పడ్డాయి. ఇరు వర్గాల వారు గొడవకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాల వారికి సర్ది చెప్పారు. గొడవతో పాఠశాల కమిటీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా శాంతిపురం ఆదర్శ పాఠశాల వద్ద తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. దాంతో శాంతిపురం విద్యాకమిటీ ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించలేదు. ఫలితాలు ప్రకటించకపోవటంతో.. పాఠశాల లోపలే కమిటీ సభ్యలు, మహిళలు ఉండిపోయారు. తెదేపాకు మద్దతు ఉన్నందునే ఫలితాలు ప్రకటించలేదని నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండి:ఎంపీపీ పదవి కోసం వైకాపాలో ఇరువర్గాల మధ్య పోటీ.. ఎంపీటీసీ సభ్యుడు అదృశ్యం

Last Updated :Sep 22, 2021, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.