Teacher cheated: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చీటీపాటల రూపంలో ప్రజల సొమ్ము ఎగ్గొట్టినందుకు ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కావడంతో విధులు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామానికి చెందిన దేసావతు రామా నాయక్ వృత్తి రిత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తితో పాటు ప్రైవేటుగా చీటీపాటలు నిర్వహిస్తుంటారు. గత కొన్నేళ్లుగా దర్శిలో ఉంటూ అందరికీ తలలో నాలుకలా కలిసి పోయి చీటీ పాటలు నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చీటీపాటలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వందల సంఖ్యలో ప్రజలు చీటీపాటలు వేశారు.
అప్పటి వరకు బాగానే సాగుతూ వచ్చింది. ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ రెండు నెలల క్రితం రామా నాయక్ కుటుంబ సభ్యులతో సహా ఎక్కడికో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు... పోలీసులను ఆశ్రయించారు. రామా నాయక్పై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం రామా నాయక్పై కేసు నమోదును దృష్టిలో ఉంచుకొని అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సుమారు రూ.4 కోట్లు నుంచి రూ.5 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని బాధితులు వాపోయారు.
ఇవీ చదవండి: