ETV Bharat / state

ఇతరులపైనే ఆధారం..భవిష్యత్​ అగమ్యగోచరం

author img

By

Published : Oct 26, 2021, 7:41 AM IST

చూడగానే అయ్యో అనిపించే దయనీయ స్థితి వాళ్లది. మరొకరి తోడులేనిదే జీవితం సాగని పరిస్థితి. ఒకాయనకు రెండుకాళ్లు, చేతులు పనిచేయవు.. ఇద్దరు బాలురైతే పుట్టినప్పటి నుంచి మానసిక దివ్యాంగులు. మరో బాలుడికి కళ్లు కనిపించవు.  వీరందరిని పట్టి పీడిస్తున్న మరో ఉమ్మడి సమస్య పేదరికం. సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా భరోసా లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

prakasham-district-some-handicapped-people-requesting-government-for-pension
అవస్థలు పడుతున్నాం.. ఆదుకోండి సారూ..!

పిల్లలిద్దరూ మానసిక వికలాంగులే...

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తాడంకి రాజు, అనూష దంపతుల కుమారులు భరత్‌(8), భవిష్‌(7) పుట్టినప్పటి నుంచి మానసిక వికలాంగులు. కనీసం కూర్చోలేరు. నుంచోలేరు. ఆ దంపతులకు కూలి పని చేసుకుంటేనే పూట గడిచేది. పిల్లలకు పింఛను ఇప్పించాలని గత 8 నెలలుగా అధికారులను మొరపెట్టుకున్నా ఫలితంలేదు. గ్రామ సచివాలయ రికార్డుల్లో రాజు ప్రభుత్వ ఉద్యోగి అని, కారు ఉందని, ఇన్‌కంటాక్స్‌ కడుతున్నట్లుగా ఉందని, పింఛను రాదని చెప్పారు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నామని, వాహనం లేదని ధ్రువపత్రాలు అందజేసినా కనికరం చూపడం లేదని ఆ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.

మమ్మల్ని ఆదుకోండి..సారూ..

మల్లికార్జున దంపతులిద్దరూ వికలాంగులే..

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీకి చెందిన దివ్యాంగుడు ఎం.మల్లికార్జునరావు(31)కు రెండు కాళ్లు, చేతులు పనిచేయవు. ఆయన భార్య కూడా దివ్యాంగురాలే. వీరికి మూడో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రూ.3 వేల పింఛను మాత్రమే వస్తోంది. ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉందని.. తనకు రూ.10 వేల పింఛను ఇప్పించాలని వేడుకుంటున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా విన్నవించినట్లు తెలిపారు.

ఆధార్‌ లేక కష్టాలు..

తండ్రి మరణం.. తల్లి ఈసడింపు.. మేనత్త ఆప్యాయత.. అందని సర్కారు సాయం

ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు కొత్తపల్లి వెంకటకార్తీక్‌. వయసు తొమ్మిదేళ్లు... కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన ఈ బాలుడికి పుట్టుకతోనే కళ్లు కనిపించవు.. శారీరక ఎదుగుదల లేక అవయవాలు కదపలేని పరిస్థితిలో దివ్యాంగుడిగా ఉన్నారు. తండ్రి చనిపోయారు. తల్లి కూడా బిడ్డను వదిలేయడంతో ఆనాథగా మారిన కార్తీక్‌ సంరక్షణ బాధ్యతలను మేనత్త కోపూరి అంజనాదేవి చూస్తున్నారు. పింఛనుకు దరఖాస్తు చేస్తే.. ఆధార్‌లో చేతి వేలిముద్రలు, కనుపాపలు రికార్డు కావడం లేదని మంజూరు చేయలేదు. ఆధార్‌ ఉంటేనే సదరన్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని వైద్యులు చెప్పారు. 3 ఏళ్ల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భరోసా దక్కడంలేదని అంజనాదేవి వాపోయారు.

ఇదీ చూడండి:

Maha Padayatra: రైతుల యాత్రకు అనుమతిపై హైకోర్టు విచారణ.. డీజీపీకి ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.