"ఎంపీపీ భర్త నెలకు రూ.లక్ష అడుగుతున్నారు.. ఎక్కడి నుంచి తెచ్చేది?"

author img

By

Published : Jun 24, 2022, 6:32 AM IST

Updated : Jun 24, 2022, 7:17 AM IST

prakasam district markapuram mpp husband demanding one lakh rupees alleges mpdo

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో.. లంచాలు, అవినీతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం, నిలదీతలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీపీ, ఎంపీడీవో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో.. లంచాలు, అవినీతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం, నిలదీతలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పోరెడ్డి అరుణ మాట్లాడుతూ.. ఎంపీడీవో టి.హనుమంతరావు అవినీతికి పాల్పడుతున్నారని, సంబంధిత చిట్టాను పేపరులో రాసుకొచ్చి మరీ సభ్యులకు చదివి వినిపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిధుల సమాచారమూ ఇవ్వడం లేదన్నారు.

అన్నీ దొంగ బిల్లులు చేసుకొని ప్రతినెలా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రా చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యాలయాన్ని లంచాలమయంగా మార్చేశారని మండిపడ్డారు. వాలంటీర్లను నియమిస్తే రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని, ఉద్యోగులు, పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి ముందుగానే రూ.35 వేలను ఆయనకు అందజేస్తేనే బిల్లులు డ్రా చేస్తారని ఆరోపించారు.

దీనికి స్పందించిన ఎంపీడీవో.. మీ భర్త చెంచిరెడ్డి ప్రతినెలా రూ.లక్ష వరకు ఇవ్వాలని అంటున్నారని, మండల పరిషత్తుకు ఏడాదికి వచ్చే జనరల్‌ ఫండ్‌ రూ.10 లక్షలేనని, ఆయన కోసం తాను ప్రతినెలా రూ.లక్ష ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. వెంటనే ఎంపీపీ, ఆమె భర్త ఇద్దరూ కలిసి ఎంపీడీవోతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఏడు గ్రామాల్లోని 8 మందికే పరిహారమా?.. గజ్జలకొండ పంచాయతీలో ఏడు గ్రామాలకు చెందిన 800 మంది రైతులుంటే కేవలం ఎనిమిది మందికే పంట నష్ట పరిహారం రావడం ఏమిటని వ్యవసాయాధికారిని సభ్యులు ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని సైతం సభ్యులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం మధ్య సభను ముగిస్తున్నట్లు ఎంపీపీ ప్రకటించారు.

మరోవైపు సర్వసభ్య సమావేశానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల స్థానంలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు వచ్చి, దర్జాగా చర్చల్లోనూ పాల్గొనడం గమనార్హం. ఆరుగురు మహిళా ఎంపీటీసీ సభ్యులుండగా ఒక్కరు కూడా రాలేదు. ఆరుగురు మహిళా సర్పంచులకు ముగ్గురే వచ్చారు. కొందరు పురుష ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు బదులు వారి బంధువులు హాజరైనా ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 24, 2022, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.