ETV Bharat / state

రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు జాతిపిత పొట్టి శ్రీరాములు: సాయిచంద్

author img

By

Published : Dec 25, 2022, 10:44 AM IST

Saichand Padayatra: ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల గొప్పతనం భావితరాలకు తెలియాలనే సంకల్పంతో సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పాదయాత్ర చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములును భారతరత్నతో గౌరవించాలని అన్నారు.

Saichand
సాయిచంద్

Saichand Padayatra: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన తెలుగు జాతిపిత, అమరజీవి పొట్టి శ్రీరాములును.. భారతరత్నతో గౌరవించాలని.. సినీనటుడు సాయిచంద్‌ అన్నారు. రాష్ట్రావతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం, ఆయన పట్టుదల, ప్రాణత్యాగం గురించి భావితరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ నెల 15న చెన్నైలోని మైలాపూర్‌ నుంచి సాయిచంద్‌ పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర శనివారం పొట్టి శ్రీరాములు జన్మస్థలమైన ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి పల్లి మండలం పడమటిపల్లికి చేరుకుంది. పొట్టి శ్రీరాములు జన్మించిన ఇంటికి చేరుకున్న సాయిచంద్‌.. అక్కడి నేలను ముద్దాడి.. మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకున్నారు. కాసేపు అక్కడే మౌనం పాటించి.. నివాళులు అర్పించిన ఆయన.. యాత్ర ముగించినట్లు ప్రకటించారు. అనంతరం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని అప్పగించి.. ఇంటిని, చిత్రపటాన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని.. సాయిచంద్‌ తెలిపారు. ఆయన వర్ధంతి వరకు అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు.

"తెలుగు జాతికి.. జాతిపిత పొట్టి శ్రీరాములు. నా చిన్నప్పటి నుంచీ ఈయనపై చాలా అభిమానం ఉంది. ఈయన కోసం ఏదైనా చేయాలని నా చిన్ననాటి కోరిక. మార్చి 16న ఆయన జన్మదినాన్ని ఘనంగా చేయాలనుకుంటున్నాం. ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు చేస్తాం". - సాయిచంద్, సినీ నటుడు

తెలుగు జాతిపిత పొట్టి శ్రీరాములు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.