ETV Bharat / state

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 9:49 AM IST

Chandrababu 'Ra Kadali Ra' Public Meeting: రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకొద్దామంటూ ఎన్నికల శంఖారావం మోగించారు.

chandrababu_meeting
chandrababu_meeting

Chandrababu 'Ra Kadali Ra' Public Meeting: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ‘రా కదలి రా!’ బహిరంగ సభను ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్​పై విమర్శలు గుప్పించారు. జగన్ ఒక్క అవకాశం అని ముద్దులు పెట్టి మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మి వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారు. ఆయనేమో సీఎం అయ్యక అందరిపై పిడిగుద్దులు కురిపిస్తున్నారని అన్నారు. ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పండని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు దివాలా తీశాయని విమర్శించారు. జగన్ సంపద సృష్టించారా? జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

లోక్‌సభ నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ కసరత్తు - ఈసారి బీసీలకే ప్రాధాన్యం

ఇంటి పెద్ద చెడ్డవాడైతే ఆ ఇల్లు అంతా నాశనం అవుతుందని అలానే జగన్‌ వల్ల రాష్ట్రం నాశనమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలలో దేశంలోనే మన రాష్ట్రం ముందుంటుందని అన్నారు. తెలుగుదేశం హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి డ్రగ్స్‌, గంజాయి అలవాటు చేసిందని మండిపడ్డారు. మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం, భూ అక్రమాలు, కల్తీ మద్యంతో అక్రమంగా ప్రజా ధనాన్ని దోచేసి తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి: చంద్రబాబు

జగన్ అధికారంలోకి వచ్చాక సొంత తల్లి, చెల్లిని గెంటేశారన్నారు. ఆయన చెల్లి వేరే పార్టీలో చేరితే తెలుగుదేశ వారిపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్​సీపీ అరాచకాలను ఎవరు ప్రశ్నించినా వారందరిపైనా జగన్‌ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైఎస్సార్​సీపీలో ఎమ్మెల్యేలను మారుస్తున్నారని యర్రగొండపాలెంలో చొక్కా విప్పుకొని తిరిగిన మంత్రి అక్కడ పనికిరారని ఇప్పుడు కొండపిలో ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మన ఇంట్లో చెత్తను వేరే వారి ఇంట్లో వేస్తామా అని నిలదీశారు.

వివేకాను చంపి ఆయన కుమార్తె సునీతను వేధిస్తున్న జగన్‌, మనిషేనా: చంద్రబాబు

టీడీపీ- జనసేన ప్రభుత్వంలో మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ 15 వేలిచ్చేలా సూపర్‌సిక్స్‌ పథకాలను వందశాతం అమలుచేస్తామని హామీ ఇచ్చారు. యువత, రైతులలు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. జగన్‌ రాజకీయాలకు పనికిరారు అయిదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచారన్నారు. వచ్చే ఎన్నికల్లో గ్రామాలన్నీ ఏకం కావాలి టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు శ్రమించాలని కోరారు. తెలుగుదేశం నుంచి పోటీచేసే అభ్యర్థులపై ఐవీఆర్‌ సర్వే చేయిస్తున్నామని తనతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆ తరువాతనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. తద్వారా సమర్థులైన నాయకులు వస్తారన్నారు. సభలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.