ETV Bharat / state

పోలీసులు ప్రజలకు శత్రువులుగా మారుతున్నారు : సోమిరెడ్డి

author img

By

Published : Jan 13, 2023, 10:14 PM IST

Somireddy Fired on Police: పోలీసుల వేధింపులు రోజురోజుకీ హద్దుమీరుతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు స్నేహితులుగా ఉండి.. వారిని రక్షించాల్సిన పోలీసులు.. శత్రువులుగా మారుతున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి తాను సిద్ధమని.. దానికోసం లాఠీ దెబ్బలైనా తింటానని పేర్కొన్నారు.

TDP leader Somireddy Chandramohan Reddy
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మేహన్ రెడ్డి

Somireddy Fired on Police: నెల్లూరు జిల్లాలో పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు..స్నేహితులుగా మెలగాల్సిన వాళ్లు.. శత్రువులుగా మారుతున్నారని అన్నారు. ప్రతిపక్షానికో న్యాయం.. అధికార పక్షానికి మరో న్యాయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి ధ్వజమెత్తారు. వెంకటాచల మండలంలో తమ పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు దాడి చేశారని అన్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశమైతే.. పోలీసుల అనుమతి ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీకి పోలీసులు బందోబస్తు కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

కార్యకర్తల కోసం అవసరమైతే లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధమని అన్నారు. కార్యకర్తలపై చేయి పడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. నా తప్పు ఉంటే పోలీసులకు క్షమాపణలు చెప్తానని.. కానీ పోలీసులు తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాకాణియే జీతాలు ఇస్తున్నట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు తీరుపై జిల్లా ఎస్పీ సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ అరాచకాలపై ప్రైవేటు కమిటీతో విచారణ జరిపించాలన్న సోమిరెడ్డి, ఇందుకు పోలీస్ అసోసియేషన్ సిద్ధమా అని ప్రశ్నించారు. పోలీసుల తీరు మారకుంటే న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.