ETV Bharat / state

చనిపోయిన కుమారుడికి అంత్యక్రియలు.. చిన్న కర్మ రోజు ఏం జరిగిందంటే..!

author img

By

Published : Oct 23, 2022, 10:30 PM IST

Funeral Rites: తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.. గుండెలవిసేలా రోదించారు.. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నకర్మ క్రతువు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇంతలోనే ఆ యువకుడు  గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. నేరుగా ఇంటికి వెళ్లగా.. కంగుతినటం గ్రామస్థులు, కుటుంబ సభ్యుల వంతైంది. అప్పటివరకు తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డను చూడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Etv Bharat
Etv Bharat

నెల్లూరు జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహించి.. చిన్న కర్మకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామ సర్పంచ్‌ పల్లేటి రమాదేవి కుమారుడు సతీష్ (34) డిగ్రీ చదివాడు. అవివాహితుడైన సతీష్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మతిస్థిమితం లేకపోవటంతో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో తల్లి రమాదేవి.. మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. శనివారం ఉదయం వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడు లావుగా ఉండటం, చేతికి దారాలు కట్టుకుని ఉండటంతో తమ కుమారుడేనని రమాదేవి పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు మృతుడు సతీష్‌గా గుర్తించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్న కర్మ క్రతువులు చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో ఆదివారం మధ్యాహ్నం సతీష్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండిపోయారు. తేరుకుని ఏం జరిగిందని సతీష్‌ను ఆరా తీశారు. తాను ద్విచక్రవాహనంపై కావలి వెళ్లానని, పెట్రోల్‌ అయిపోవటంతో బైక్‌ అక్కడే పెట్టి బస్సులో వచ్చానని చెప్పాడు. సతీష్ మరణించలేదని తెలియటంతో కుటుంబ సభ్యులు ఆనందంలో ఉన్నారు.

ఆ మృతదేహం ఎవరిది?: చెరువులో మృతి చెందింది.. సతీష్ అని భావించిన అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లి దహనం చేశారు. ప్రస్తుతం సతీష్ బతికి ఉన్నాడు. అయితే చెరువులో లభించిన మృతదేహం ఎవరిదన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. మృతదేహం దహనం చేయటంతో ప్రస్తుతం మృతుడి ఆనవాళ్లు కూడా లభించే పరిస్థితి లేదు. ఆదివారం వరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా సతీష్ తల్లి వద్ద పోలీసులు మరొక ఫిర్యాదు తీసుకుని.. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.