ETV Bharat / state

నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయండి : కోటంరెడ్డి

author img

By

Published : Feb 3, 2023, 10:23 AM IST

Updated : Feb 3, 2023, 12:27 PM IST

kotamreddy
kotamreddy

10:11 February 03

నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయండి : కోటంరెడ్డి

నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయండి : కోటంరెడ్డి

MLA KOTAMREDDY COMMENTS ON PHONE TAPPING : అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని.. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాడినన్నారు. తన మనసు విరిగిందని.. ప్రాణాతి ప్రాణంగా ఆరాధించిన జగన్‌ ప్రభుత్వంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆఖరి దాకా ఉండి మోసం చేయలేదని.. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవన్న కోటంరెడ్డి.. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగినట్లు వెల్లడించారు.

దాదాపు 10 మంది మంత్రులు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే తన వద్ద ఉన్న ఆధారం బయటపెట్టినట్లు తెలిపారు. ట్యాపింగ్‌పై విచారణ జరపండి అని కోరినట్లు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదని.. ప్రజలు ఆమోదించేవారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆషామాషీగా జరగదని అని కోటంరెడ్డి అన్నారు.

"నేను చిత్తశుద్ధితో పనిచేస్తే అవమానించారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చా. నాకు అధికారం కొత్త కాదు.. ఇష్టం కాదు. ప్రజలకు మేలు చేయాలనేది అనేది నా తపన. అనిల్‌ను కార్పొరేటర్‌ చేసింది ఎవరు.. ఆనం కాదా? 2008లో కార్పొరేటర్‌ టికెట్‌ ఇప్పించింది ఆనం కాదా? 2009లో కాంగ్రెస్‌ టికెట్ ఇప్పించింది ఆనం కాదా?. అనిల్‌కు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌గా పనిచేసింది నేను కాదా?. నా కంటే చిన్నవాడివైనా అనిల్‌ నాయకత్వం వర్ధిల్లాలని కోరా. నేను తప్పు చేసి ఉంటే నా బిడ్డలకు శాపం తలుగుతుందన్నారు.. నా బిడ్డలు ఏం చేశారు.. వారిపై విమర్శలు ఎందుకు?"-కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే

చంద్రబాబును కలిస్తే అప్పుడే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్​ చేయలేదు?: మానసిక క్షోభకు గురై వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినట్లు కోటంరెడ్డి తెలిపారు. బయటకు వచ్చాక తన ఇష్టం వచ్చిన వ్యక్తులను కలవవచ్చన్నారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తాను.. చంద్రబాబును ఎలా కలుస్తానని ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబును కలిస్తే తర్వాత రోజే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. తప్పుడు ఆరోపణలతో సజ్జల ఆడియోలు వదులుతున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడికే సలహాదారుగా ఉండే పరిజ్ఞానం సజ్జలకు ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో థియేటర్లు నడపలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇసుక, మద్యం పేరుతో రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారు.. డబ్బులు ఎక్కడికి చేరుతున్నాయో ఆడియోలు పెట్టించండని సవాల్​ విసిరారు.

నా గొంతు ఆగాలంటే ఎన్​కౌంటర్​ చేయండి: కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అని లీకులు ఇస్తున్నారన్నా ఆయన..తనను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండని తేల్చిచెప్పారు. తనను శాశ్వతంగా జైలులో పెట్టండని సూచించారు. కేసులు పెట్టి అలసి పోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తన గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం అన్న కోటంరెడ్డి.. ఎన్‌కౌంటర్‌ చేయించండన్నారు. ఎన్‌కౌంటర్‌ చేయిస్తే తన గొంతు ఆగుతుందన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని.. ఎమ్మెల్యేగా మీరు చేసే అభివృద్ధి పనులకు సహకారం అందిస్తాన్నారు.

"కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారు. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్‌ చేయించండి. అప్పుడే నా గొంతు ఆగుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది" -కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే

నెలరోజులు పూర్తిగా రాజకీయాలు ఆపేస్తా: అధికార పార్టీకి దూరంగా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తా అని పేర్కొన్నారు. మీరు పనులు చేస్తే తాను ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని.. ఆరోగ్యపరమైన రాజకీయాలు చేద్దాం అని కోరారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రభుత్వ చేతిలో పని.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. భవిష్యత్తు ముఖచిత్రం ప్రజలు చూస్తారన్నా కోటంరెడ్డి.. ఇప్పుడు రాజీనామా చేసినా ఎన్నికలు ఎలాగూ జరగవని..నెల రోజులు పూర్తిగా రాజకీయాలు ఆపేస్తానన్నారు. ప్రస్తుతం గ్రామ దేవత జాతరపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు. తన వెంట నడిచే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలుంటాయని కోటంరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 3, 2023, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.