నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పంపిణీ కార్యక్రమం జనవరి 20వ తేదీ వరకు జరగనుండగా... జిల్లాలో మాత్రం 26 వరకు నిర్వహించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతి ఇచ్చారని చెప్పారు.
జిల్లాలో 1477 లేఅవుట్లు సిద్ధం చేయగా, 1,73, 850 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇళ్లు లేని పేదవారు ఎవ్వరూ ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న లేఅవుట్లలోనూ సౌకర్యాలు మెరుగు పరిచి లబ్దిదారులకు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.
ఎన్ఆర్జీఎస్ ద్వారా జిల్లాలో రోడ్లు, డ్రైనేజి, మౌలిక సదుపాయాల కల్పన కోసం అదనంగా రూ.వంద కోట్లతో ఈ ఏడాది పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మొదటి విడత కింద 7,444 మందికి పక్కా ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: రేపు 'రేషన్ పంపిణీ' ప్రత్యేక వాహనాల ప్రారంభం