నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. అధికారులు ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడంతో పాటూ.. సిబ్బందిపై చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఎదుట ధర్నా చేపట్టారు.
ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలు అందిస్తుంటే.. తమకు అందించే బహుమతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్లో భోజనం సమయానికి అందడం లేదన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు.. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అలాగే ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడంతోపాటూ.. డ్యూటీ డాక్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
దీంతో అధికారుల చర్యలను నిరసిస్తూ.. అన్ని విభాగాల నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్ను వెంటనే తొలగించి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు